దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఆదివారం నాడు ఒక్కరోజే 25462 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 19, సోమవారం రాత్రి 10 గంటల నుండి ఏప్రిల్ 26, సోమవారం ఉదయం 6 గంటల వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీలో కరోనా పరిస్థితిపై లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తో చర్చించిన అనంతరం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఢిల్లీలో కరోనా నాలుగో వేవ్ నడుస్తుందని, రోజువారీ కేసులు 25,000 కు చేరుకున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ ఆరోగ్య వ్యవస్థ దాని పరిమితిని చేరుకుందని చెప్పారు.
దీంతో ఆరోగ్య వ్యవస్థ కూలిపోకుండా ఉండటానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కరోనా వ్యాప్తి, పాజిటివ్ రేటు క్రమంగా పెరిగిపోతుందని, ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత ఏర్పడుతుందని చెప్పారు. లాక్డౌన్ సమయంలో అవసరమైన సేవలు, వైద్య సేవలు, ఆహార సంబంధిత సేవలు కొనసాగుతాయని అన్నారు. వివాహాలకు కేవలం 50 మందికే అనుమతి ఇస్తామని, అందుకోసం ప్రత్యేకంగా పాస్లు జారీ చేయబడతాయని తెలిపారు. మరోవైపు ఢిల్లీలో ఇప్పటివరకు మొత్తం 8,53,460 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 7,66,398 మంది కరోనా నుంచి కోలుకోగా, 12,121 మంది మరణించారు. ప్రస్తుతం 74,941 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ