పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31, శుక్రవారం నాడు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించారు. దేశ ప్రజల కలలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేయాల్సి ఉందని, ఈ దశాబ్దం భారత్కు ఎంతో కీలకంగా మారనుందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం దేశాన్ని సరికొత్త దిశగా నడపడమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉండే అన్ని సౌకర్యాలను గ్రామాలకు కూడా విస్తరించాలని అన్నారు. నిరసనలు, హింస వైపు అడుగులేయడం వలన దేశ ప్రతిష్ట దిగజారుతుందని పేర్కొన్నారు. రాష్ట్రపతి కోవింద్ తన ప్రసంగంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ రోజు సమావేశాల సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు.
రాష్ట్రపతి ప్రసంగంలో ముఖ్యాంశాలు:
- ఆర్టికల్ 370, ఆర్టికల్35ఏ రద్దు బిల్లు లోక్ సభ, రాజ్యసభ లలో మూడొంతుల మెజార్టీతో ఆమోదం పొందడం చారిత్రాత్మక విషయమని చెప్పారు
- పౌరసత్వ సవరణ చట్టం కూడా చారిత్రాత్మక చట్టం, సీఏఏ అమల్లోకి తెచ్చి కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ కలను నిజం చేసింది
- వివాదాస్పద రామజన్మభూమిపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం దేశ ప్రజలు ఐక్యత ఏంతో హర్షణీయం
- ట్రిపుల్ తలాక్ వల్ల మైనార్టీ మహిళలకు న్యాయం జరిగింది
- ట్రాన్స్ జెండర్ హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది
- ఉజ్వల్ యోజన, ఆయుష్మాన్ యోజన పథకాల ద్వారా కేంద్రప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతోంది
- కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ను ఏర్పాటుచేసి కేంద్రం రికార్డు నెలకొల్పింది
- దేశంలో 27వేల ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు
- భారత్లో విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగింది
- చంద్రయాన్-3కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
[subscribe]