సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ దేశ రాజకీయాలు వేడెక్కుతూ వస్తున్నాయి.త్వరలో జరగనున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ అంతర్గత కలహాలు పక్కన పెట్టయినా సరే బీజేపీని ఎదుర్కొనేందుకు గట్టిగా నిర్ణయించుకున్నాయి. దీనికోసమే బెంగళూరు వేదికగా విపక్షాల రెండో విడత భేటీ జరిపి బీజేపీని ఎలా ఎదుర్కోవాలో నేతలంతా చర్చించుకున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ సహా 26 పార్టీల నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో.. వాడివేడి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు.. విపక్షాల కూటమిలో యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీకి కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే కన్వీనర్గా బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ పేరు వినిపిస్తోంది
నిజానికి ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే.. అన్ని పార్టీలు ఒకవైపు నరేంద్ర మోడీ మరోవైపు అన్నట్లుగా సాగుతున్నాయి. టార్గెట్ మోడీగా పావులు కదుపుతున్న నేతలు మూడోసారి ఎన్డీఏను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనీకుండా చేయడమే తమ ధ్యేయంగా కంకణం కట్టుకున్నాయి. దీంతోనే వరుస భేటీలతో నేతలంతా బిజీబిజీగా గడుపుతున్నారు. మిత్రపక్షం పార్టీకి ఇండియా అని పేరు పెట్టుకుని మరీ ఇండియాలోనే పాగా పాతాలని నిర్ణయించుకున్నాయి. అయితే వారి ఉమ్మడి నిర్ణయాలు ఎలా ఉంటాయో కాని.. తాజాగా ప్రధాని మోడీ విపక్ష పార్టీల సదస్సుపై విమర్శలను ఎక్కుపెట్టడమే రాజకీయ వర్గాలలో ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది.కుటుంబం కోసం, కుటుంబం చేత, కుటుంబం కొరకు అనేది వారి మంత్రం..పచ్చి అవినీతిపరులు సదస్సు జరుగుతోందని సాక్షాత్తూ ప్రధాని నోటి వెంట రావడంతో.. కూటమికి పీఎం కూడా భయపడుతున్నారా అన్న ప్రశ్నలు కూడా వినిపించాయి.
రెండు రోజుల పాటు జరిగిన విపక్షాల భేటీలో..కనీస ఉమ్మడి ప్రణాళిక రూపకల్పన, సంయుక్త ఆందోళనల నిర్వహణ లక్ష్యంగా సమాలోచనలు జరిపారు. అయితే విపక్ష కూటమిలోని భాగస్వామ్య పక్షాల సమన్వయం, కనీస ఉమ్మడి ప్రణాళిక ఖరారులో కీలకంగా వ్యవహరిస్తారని అంతా అనుకున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మొదటి రోజు సమావేశానికి హాజరుకాకుండా పొలిటికల్ సర్కిల్ లో పెద్ద చర్చకు దారి తీసేలా చేశారు. శరద్ పవార్ విపక్షాల భేటీకి దూరం వెనుక కారణాలను వెతుక్కునేలా చేశారు. మోడీతో చేతులు కలపడానికి సమావేశానికి దూరంగా ఉన్నారా అన్న అనుమానాలు రేకెత్తించారు. అదే సమయంలోనే చీలిక వర్గం నేత అజిత్ పవార్ మరోసారి శరద్ పవార్ను కలవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే పార్టీలో చీలిక పరిణమాలతో తొలి రోజు విపక్షాల భేటీకి దూరమైన శరద్ పవార్.. రెండో రోజే తనపై షికార్లు కొడుతున్న రూమర్లకు హాజరై చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేలా చేశారు. ఏది ఏమయినా మోడీ వ్యతిరేక కూటమి పవరెలా ఉంటుందో.. మోడీ సర్కార్ తన బలాన్ని మరోసారి రుజువు చేసుకుంటుందో చూడాలంటే కొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే.