చాణక్యుడు ఎంతో ముందు చూపు గల అపర మేధావిగా పేరు పొందారు. తన అపారమైన జ్ఞానసంపదను, విలువైన ఆలోచనలను చాణక్య నీతి ద్వారా భావితరాలకు అందించారు .చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం.. జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ఇతరులకు జీవిత సత్యాలను బోధించడంతో పాటు.. జీవితంలో ఎలా ఉండాలో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అనే సరైన మార్గాన్ని చూపిస్తుంది.
చాణక్యుడి నీతి సూత్రాలు..చాలామందికి వ్యక్తిగతంగానూ, సామాజికంగానే కాదు..రాజకీయంగా ఎదగడానికి కూడా సమగ్ర మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఎందుకంటే..ఈ నీతి శాస్త్రంలో అనేక ముఖ్యమైన సూత్రాలు, విధానాలు ఉన్నాయి. ఇవి మనుష్యులలోని సద్గుణాలను, దుర్గుణాలను ఎత్తి చూపుతాయి. అంతేకాదు మనుష్యులలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకొని, విజయం సాధించేలా దిశానిర్దేశం చేస్తాయి.
చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎవరికైనా కొన్ని అవలక్షణాలు ఉంటే వాటి వల్ల చాలా కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ లక్షణాలు ఉండటం వల్ల అతను సమాజంలో దిగజారి బతకాల్సిన పరిస్థితుల్లోకి వెళతాడని సూచించారు. సంపదను కోల్పోయి పేదవారిగా మిగిలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని చాణక్యుడు చెబుతారు. అంతేకాదు అంతవరకూ తనకున్న గౌరవ ప్రతిష్టలు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని అందుకే కొన్ని అవలక్షణాలను వదులుకోవాలని చాణక్యుడు చెబుతూ ఉంటారు.
చాణక్య నీతిలో చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం..ఎవరైతే అసలు శుభ్రత పాటించకుండా మురికిగా ఉంటారో, ఎప్పుడు మురికిలో జీవిస్తూ.., శుభ్రమైన బట్టలు ధరించకుండా ఉంటారో.. ఎవరైతే వారి చుట్టూ అపరిశుభ్రమైన వాతావరణంలో జీవిస్తారో.. అలాంటివారు ద్రారిద్య్రాన్ని ఆహ్వానించడమే అవుతుందని అంటారు. అలాంటి వ్యక్తులు తరచూ అనారోగ్యాల పాలవడం, ఆసుపత్రులలో ఖర్చు చేయడమే సరిపోతుందని దాని ద్వారా తమ సంపదను కోల్పోయి.. పేదవారిగా మారతారని చాణక్యుడు వివరించారు.
అంతేకాదు.. ఎల్లప్పుడూ కర్కషంగా, పరుషంగా మాట్లాడే వ్యక్తులు, అసభ్య పదజాలం మాట్లాడుతూ ఉండే వ్యక్తులు..తమ గౌరవాన్ని, అవకాశాలను కోల్పోతారని చాణక్య నీతి చెబుతుంది. అలాగే అలాంటి వారి వద్ద లక్ష్మీదేవి ఉండటానికి అస్సలు ఇష్టపడదట. కటువుగా, పరుషంగా మాట్లాడటం వల్ల ఒక వ్యక్తి తనతో ఉన్న బంధాలను కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందని చాణక్యుడు చెబుతారు. అందుకే కఠినంగా మాట్లాడే అలవాటును.. వెంటనే వదులుకుని ఎప్పుడూ అందరితో మంచిగా మాటలు మాట్లాడాలి. మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడితే ఎటువంటి సమస్య కూడా రాదు.
అలాగే చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం.. సాయంత్రం అంటే సూర్యాస్తమయంలో ఇంకా చెప్పాలంటే.. సంధ్యా సమయంలో అస్సలు నిద్రపోకూడదట. అలా నిద్రపోయే వారు ఎప్పుడూ పేదవాళ్లుగానే ఉంటారు. సంద్యా సమయంలో పడుకున్న వారిపై లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుటికీ ఉండదని..అందుకే సంధ్యవేళలో నిద్రపోకూడదని మన పెద్దలు కూడా చిన్నప్పటి నుంచీ చెబుతుంటారు.
అంతేకాదు సోమరితనం ఒక చెడు అలవాటు అని చాణక్యుడు అంటారు. ఎందుకంటే సోమరిపోతు ఏ పనిచేయలేడు కాబట్టి.. పనిచేయని వారి వద్ద డబ్బు ఉండదు దానితో పాటు.. సమాజంలో విలువ కూడా అస్సలు ఉండదంటారు చాణక్య. ఎవరైనా సరే ఒక వ్యక్తి జీవితంలో తాను తప్పకుండా విజయం సాధించాలని అనుకుంటే.. ముందుగా సోమరితనాన్ని వదులుకోవాలని చాణక్య నీతిలో చెబుతుంది. అలాగే అనవసరమైన ఖర్చులు చేసేవారి దగ్గర, దుబారా ఖర్చులు చేసే వారి దగ్గర డబ్బు నిలవదట. ఎందుకంటే అలాంటి వారికి జీవితంలో డబ్బు విలువ తెలియదు కాబట్టి లక్ష్మీదేవి కూడా వారి దగ్గర ఉండటానికి ఇష్టపడదట. అయితే ఇలాంటి వారికి డబ్బు విలువ తెలిసే నాటికి.. వారి వద్ద చిల్లిగవ్వ ఉండదంటారు చాణక్య.అందుకే ఆదాయానికి అనుగుణంగా ఖర్చులు ఉండాలని.. రేపటి కోసం కొంత మొత్తంలో అయినా పొదుపు చేసుకోవాలని చాణక్యుడు చెబుతారు.అలా సరైన ఆర్థిక ప్రణాళిక కలిగిన వారే జీవితంలో విజయం సాధిస్తారని చాణక్య నీతి వివరిస్తుంది.