గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో జులై 26, 2008న జరిగిన వరుస బాంబు పేలుళ్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు సృష్టించిన ఈ మారణహోమంలో 56 మంది చనిపోగా, 200 మందికి పైగా గాయపడ్డారు. కాగా ఈ వరుస పేలుళ్ల కేసులో శుక్రవారం నాడు సంచలన తీర్పు వెలువడింది. ఈ పేలుళ్ల కేసులో త్వరిత విచారణ కోసం నియమించబడిన ప్రత్యేక కోర్టు మొత్తం 49 మంది దోషులలో 38 మందికి మరణశిక్ష విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) మరియు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 ప్రకారం 38 మందికి మరణశిక్ష విధిస్తునట్టు పేర్కొన్నారు. అలాగే మిగిలిన 11 మందికి కోర్టు జీవితఖైదు విధించింది.
ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టి ముందుగా 78 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఒక నిందితుడు అప్రూవర్గా మారగా, మిగిలిన 77 మందిపై ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు ఇటీవలి కాలంలో సుదీర్ఘంగా జరిగిన నేర విచారణలలో ఒకటిగా మిగిలింది. గత ఏడాదే ఈ కేసు విచారణ ముగియగా, మొత్తం 49 మందిని దోషులుగా నిర్ధారిస్తూ ఫిబ్రవరి 8న ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తాజాగా 38 దోషులకు మరణశిక్ష, 11 మందికి జీవితఖైదు శిక్షలను ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ