ఆయన తిరుగులేని రాజకీయ నాయకుడు. మాటల మాంత్రికుడు. నిన్న కూడా విజయం మనదే అంటూ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఎన్నికల కదన రంగానికి సిద్ధం కావాలని బీ ఫారాలు ఇచ్చి పంపించారు. ఆయనే బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో పార్టీపై అసమ్మతి ఉన్నా వెంటనే అప్రమత్తమై సద్దుమణిగేలా చేస్తారు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలోనే ముసలం మొదలైంది. రాష్ట్రమంతా బీఆర్ ఎస్ లో అసమ్మతి లేకుండా చేసేందుకు ఆయన ప్రయత్నిస్తుంటే.. మరోవైపు ఆయన ఇలాకాలోనే.. ఆయనపైనే వ్యతిరేకత వస్తుండడం రాజకీయాల్లో చర్చనీయంశంగా మారింది. ఓ వైపు.. విపక్ష నేత రాజేందర్.. మరోవైపు నియోజకవర్గంలోని సొంత పార్టీ నేతలే కేసీఆర్ కు వ్యతిరేకంగా పని చేస్తుండడం దుమారం రేపుతోంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రత్యేకంగా సమావేశమై తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఐదేళ్లలో తాము ఓటేసి గెలిపించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక్కసారి కూడా చూడలేదని వాపోయారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన అసమ్మతి నాయకులు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టేకులపల్లి రాంరెడ్డి, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ జడ్పీటీసీలు సింగం సత్తయ్య, యాదగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెట్టి సురేశ్గౌడ్, తూప్రాన్ మునిసిపల్ కౌన్సిలర్ శ్రీశైలంగౌడ్లు మాట్లాడుతూ తాము కష్టపడి ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రి, తమకు ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని, ఒక్కసారి కూడా ఆయనను చూడలేదని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీలో తమకు సముచిత స్థానం దక్కడం లేదని, కొత్తగా వచ్చిన వారికి పార్టీలో పెద్దపీట వేస్తున్నారని వాపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నా తమను పట్టించుకోవడం లేదని, తమకు కష్టం వస్తే ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో పార్టీ కోసం కష్టపడ్డామని, ఆస్తులు అమ్ముకున్నామని తమకు ఇప్పుడు గుర్తింపు లభించడం లేదన్నారు. అంతేకాకుండా పార్టీ కోసం కష్టపడిన తమను విస్మరిస్తున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించేందుకు ఈ నెల 18న గజ్వేల్ మండలం రిమ్మనగూడలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. వారివెంట మాజీ ఎంపీపీ వెంకట్రెడ్డి, మాజీ కౌన్సిలర్లు సుభాష్చంద్రబోస్, రామచంద్రాచారి, నాయకులు ఎక్బాల్, కొన్నె రాజిరెడ్డి, మాజీ సర్పంచ్లు ములుగు రాంరెడ్డి, ప్రభాకర్, పిట్ల రాములు, లక్ష్మణ్, రాంచంద్రారెడ్డి, గుంటుకు భిక్షపతి, గాడిపల్లి శ్రీనివాస్ తదితరులున్నారు.
కేసీఆర్ను ఓడిస్తా
మొదటి నుంచీ కేసీఆర్ పై నిప్పులు గక్కుతున్న బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ను ఓడించడమే తన ప్రధాన కర్తవ్యమని వెల్లడించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో విలేకరులతో మాట్లాడారు. దమ్ముంటే హుజూరాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావు.. ఎవరైనా తన మీద పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఎంపీగా బండి సంజయ్కి, శాసన సభ్యుడిగా తనకు ప్రొటోకాల్ లేకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి కృత్రిమంగా హైప్ తీసుకువస్తున్నారని ఈటల విమర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తన నియోజకవర్గంలోని అసమ్మతిని చల్లార్చేందుకు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE