తెలంగాణలో మొన్నటి వరకు డీలా పడిన కాంగ్రెస్.. అనూహ్యంగా పుంజుకుంది. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందనుకున్న సమయంలో.. వేగంగా దూసుకొచ్చింది. కర్ణాటక ఫలితాలు.. బీఆర్ఎస్ నుంచి పలువురు దిగ్గజ నేతలు చేరడంతో కాంగ్రెస్కు బలం చేకూరినట్లు అయింది. దీంతో వేగంగా తమ గ్రాఫ్ను పెంచుకుంటూ కాంగ్రెస్ దూసుకెళ్లింది. అంతకంటే ముందే గులాబీ బాస్.. తమ గెలుపు గుర్రాలను రేస్లోకి దింపేశారు. షెడ్యూల్ రాకముందే తమ అభ్యర్థులను ప్రకటించేశారు. అయితే కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల ఎంపిక విషయంలో మొన్నటి వరకు తలామునకలయింది. తీవ్రమైన పోటీ నెలకొనడంతో.. అభ్యర్థుల ఎంపిక కాస్త ఆలస్యమయింది. దీంతో పార్టీ గ్రాఫ్ కూడా రెండు వారాలుగా పడిపోయింది.
పార్టీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుండడంతో.. అప్రమత్తమైన కాంగ్రెస్ తమ క్యాండిడేట్ల మొదటి లిస్ట్ను ప్రకటించేసింది. పోటీ ఎక్కువగా ఉన్న స్థానాలను పక్కనపెట్టి.. పలు కీలక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆ తర్వాత దశల వారిగా మిగతా స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించనుంది. అయితే ఓవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టికెట్లను అమ్ముకున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు, ధర్నాలు కూడా చేస్తున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్ మొదటి అభ్యర్థుల జాబితా సంచలనంగా మారింది. మొదటి జాబితాలో రేవంత్ రెడ్డి వర్గీయులకే టికెట్లు ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా హాట్ హాట్గా చర్చ జరుగుతోంది.
ఈసారి కాంగ్రెస్ ఉప్పల్ టికెట్ను పరమేశ్వర్ రెడ్డికి ఇచ్చారు. అయితే ఆయనకు టికెట్ ఇవ్వడంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురవుతోంది. పార్టీలో సుదీర్ఘకాలంగా పని చేస్తున్న సీనియర్లను పక్కనెట్టి ఓ డివిజన్ స్థాయి నేతకు టికెట్ ఎలా ఇస్తారని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. కేవలం రేవంత్ రెడ్డికి దగ్గరి వ్యక్తి అన్న ఒకే ఒక్క కారణంతో ఆయనకు టికెట్ ఇచ్చారని మండిపడుతున్నారు. అటు సనత్ నగర్ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆ నియోజకవర్గ టికెట్ను కోట నీలిమకు కట్టబెట్టారు. ఆమె పేరు ప్రకటించగానే.. చాలా మంది షాక్కు గురయ్యారు. ఎందుకంటే.. నీలిమ నియోజకవర్గంలో అత్యధికులకు అసలు పరిచయమే లేదట. అటువంటిది ఆమెకు టికెట్ ఎలా ఇస్తారని పలువురు అధిష్టానాన్ని నిలదీస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE