ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. ఫిబ్రవరి 16, ఆదివారం నాడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం చారిత్రక రామ్లీలా మైదానంలో జరగనుంది. బుధవారం నాడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ లో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణస్వీకారం కార్యక్రమంపై వీరి భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.
అలాగే కొత్తగా ఎన్నికైన 62 మంది ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ ఈ రోజు సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో ఆప్ ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆమ్ ఆద్మీ పార్టీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అనుమతి కోరనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించిన నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశంలోని పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
[subscribe]