ప్రఖ్యాత ఆర్య సమాజ్ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన కొన్నిరోజులుగా ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిల్లరీ సైన్సెస్ (ఐఎల్బిఎస్) లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా మారడంతో మంగళవారం నుండి ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మల్టిఫుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. స్వామి అగ్నివేశ్ పార్ధివదేహాన్ని రేపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల దర్శనం కోసం జంతర్ మంతర్ నివాసంలో ఉంచనున్నారు. అలాగే అంత్యక్రియలు శనివారం సాయంత్రం 4 గంటలకు గురుగ్రామ్లో జరుగుతాయని తెలిపారు.
స్వామి అగ్నివేశ్ సెప్టెంబర్ 21,1939 న ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. కోల్కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీ నుంచి లా, కామర్స్ పట్టా పొందారు. ఆర్యసమాజ్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించి, హర్యానాలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే మంత్రిగా కూడా సేవలందించారు. 1981 లో బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్ స్థాపించి బాలలకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించేందుకు పోరాటం చేశారు. ఆర్య సమాజ్ ప్రపంచ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా స్వామి అగ్నివేశ్ పనిచేశారు. అన్నా హజారే నడిపిన ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ క్యాంపైన్ లో కూడా పాల్గొన్నారు. ఏపీలో మావోయిస్టులతో చర్చల జరిగిన సమయంలో ఆయన మధ్యవర్తిత్వం వహించారు. స్వామి అగ్నివేశ్ మరణం పట్ల దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu