ప్రధాని నరేంద్ర మోదీ మే 12, మంగళవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తూ కరోనా సంక్షోభంతో దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో “ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20 లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని తీసుకొస్తునట్లు ప్రకటించారు. ఈ ప్యాకేజీ దేశ జీడీపీలో 10 శాతమని పేర్కొన్నారు. కాగా ఈ ఆర్ధిక ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు మీడియా సమావేశంలో వెల్లడించారు.
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” లో భాగంగా ప్రస్తుతం అమలులో వున్న టిడీఎస్/టిసీఎస్ రేట్లు 25 % తగ్గిస్తున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రేపటి నుంచి మార్చ్ 31, 2021 వరకు టిడీఎస్/టిసీఎస్ తగ్గింపు రేటు అమల్లో ఉంటుందని చెప్పారు. దీనివలన ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులకు సుమారుగా రూ.50 వేల కోట్లు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఆలాగే అన్ని రకాల ఐటి రిటర్న్ చెల్లింపు గడువును జూలై 31 నుండి నవంబర్ 30 వరకు పొడిగించినట్టు తెలిపారు. వివాద్ సే విశ్వస్ పథకం డిసెంబర్ 31, 2020 వరకు పొడిగించినట్టు చెప్పారు. ఇక ఛారిటబుల్ ట్రస్టులు, కార్పొరేటేతర బిజినెస్, ఎల్ఎల్పిలు మరియు సహకార సంస్థలకు పెండింగ్లో ఉన్న టాక్స్ చెల్లింపులను వెంటనే ప్రాసెస్ చేస్తామని పేర్కొన్నారు.
మరోవైపు రూ 15,000 లోపు వేతనాలు కల్గిన చిన్న ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా పీఎఫ్లో ఉద్యోగుల వాటాను కేంద్ర ప్రభుత్వమే సమకూర్చనుంది. 100 కంటే తక్కువ మంది ఉద్యోగులున్న సంస్థల్లో, ప్రభుత్వమే కంపెనీ వైపు నుండి 12% మరియు ఉద్యోగుల వైపు నుండి 12% పిఎఫ్ ను సమకూర్చనుంది. ముందుగా పీఎం గరిబ్ కళ్యాణ్ యోజన పథకంలో ఈ అంశాన్ని ప్రవేశ పెట్టి మార్చ్, ఏప్రిల్, మే నెలలకు చెల్లించారు. ఇక జూన్, జులై, ఆగస్టు నెలలకు కూడా ఈపీఎఫ్ చెల్లించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 70.22 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుండగా, 2,500 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు.
నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:
- స్వయం సంవృద్ధిని పెంచడానికి మరియు స్వావలంబన భారతదేశాన్ని నిర్మించడానికి “ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” ఉపయోగపడుతుంది.
- భారతదేశం యొక్క 5 మూల స్తంభాలు -ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, సాంకేతిక ఆధారిత వ్యవస్థ, శక్తివంతమైన జనాభా మరియు డిమాండ్.
- భారతదేశాన్ని స్వయం సంవృద్ధి దేశంగా మార్చడమే గాక ప్రపంచ వృద్ధికి తోడ్పడే సామర్థ్యం ఉన్న గొప్ప దేశంగా నిర్మించాలన్నదే లక్ష్యం.
- అంతర్జాతీయ స్థాయిలో భారత ఉత్పత్తులకు పేరు రావాలి.
- భూమి, కార్మికులు, నగదు లభ్యత, వివిధ చట్టాలకు ఈ ప్యాకేజీలో ప్రాధాన్యత.
- సమాజంలోని అన్ని వర్గాలతో, అన్ని మంత్రిత్వ శాఖలతో విస్తృత సంప్రదింపులు జరిపిన తరువాత పీఎం మోదీ ఈ ప్యాకేజికి రూపకల్పన చేశారు.
- బీజేపీ అధికారంలోకి వచ్చాక జన ధన్ యోజన, ఆధార్, పీఎం ఆవాజ్, స్వచ్ఛ భారత్, ఆయుష్మాన్ భారత్, ఉజ్జ్వల, మైక్రోఫైనాన్స్ పథకాలు వంటి ఎన్నో పధకాలు ప్రవేశపెట్టాం.
- లాక్డౌన్ తర్వాత పేదల సంక్షేమం కోసం రూ.1.70 లక్షల కోట్ల పిఎం గరిబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని పీఎం మోదీ అందించారు.
- పేదలు, వలస కార్మికులు మరియు దివ్యంగులకు పట్ల బాధ్యత ఉంది. నేరుగా వారి ఖాతాల్లోకే డబ్బు జమ అవుతుంది.
- రోజుకో రంగానికి చొప్పున ఆర్థిక మంత్రిత్వ శాఖ “ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” ప్యాకేజి యొక్క ప్రణాళికలు వెల్లడిస్తుంది.
- ఈ రోజు ప్రకటించే ఆర్ధిక ప్యాకేజీలో భాగంగా 15 అంశాల్లో కేటాయింపులు ఉంటాయి.
–>ఆరు ఎంఎస్ఎంఈ కోసం
–>మూడు టాక్స్ సంబంధితమైనవి
–>రెండు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ల కోసం
–>రెండు ఎన్బిఎఫ్సి కోసం
–>రెండు ఎంఎఫ్ఐ ల కోసం
–>ఒకటి డిస్కోమ్ల కోసం
–>ఒకటి రియల్ ఎస్టేట్ కోసం
–>ఒకటి కాంట్రాక్టర్లు కోసం
ఎంఎస్ఎంఈ (చిన్న మధ్య తరగతి పరిశ్రమల) కోసం:
- రూ.3 లక్షల కోట్ల విలువైన రుణాలు.
- రుణాలపై 4 సంవత్సరాల పరిమితి.
- 10 నెలల మారటోరియం (తాత్కాలిక నిషేధం) ఇవ్వబడుతుంది.
- ప్రిన్సిపల్ అమౌంట్ మరియు వడ్డీపై బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సిలకు 100% హామీ.
- ఈ అవకాశం అక్టోబర్ 31, 2020 వరకు ఉంటుంది.
- అదనపు రుసుము వసూలు చేయబడదు.
- సబార్డినేట్ డెట్ బేస్డ్ స్కీమ్ ద్వారా రూ.20,000 కోట్ల లిక్విడిటీ.
- దీనిపై సిజిటిఎంఎస్ఇకి రూ.4 వేల కోట్లు అందిస్తున్నాం.
- ఎంఎస్ఎంఈ ల లోకి రూ .50,000 కోట్ల ఈక్విటీ.
- రూ.200 కోట్ల లోపు కొనుగోళ్ళకు గ్లోబల్ టెండర్లకు అవకాశం లేదు.
- ఎన్బిఎఫ్సి ల కోసం రూ.30,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ పథకం. రుణ పత్రాలకు భారత ప్రభుత్వం పూర్తిగా హామీ ఇస్తుంది. ఎన్బిఎఫ్సిల కోసం పాక్షిక క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ 2.0 ద్వారా రూ.45,000 కోట్ల లిక్విడిటీ.
- డిస్కోమ్ల కోసం 90,000 కోట్ల అత్యవసర లిక్విడిటీ పెట్టుబడులు, రాష్ట్రాలు ఇచ్చే హామీలు ఆధారంగా నిర్ణయం.
- రైల్వే, రోడ్లు వంటి అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు కాంట్రాక్టర్లకు 6 నెలల వెసులుబాటు. కాంట్రాక్ట్ నిర్మాణ పనులు, వస్తువులు మరియు సేవల ఒప్పందం, పనులు పూర్తీ కావడానికి ప్రభుత్వ కాంట్రాక్టర్లకు ఆరు నెలల పొడిగింపు వరకు ఎలాంటి ఖర్చులేదు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu