కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం నాడు రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచే బంద్ ప్రారంభించారు. చాలా చోట్ల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అలాగే కొన్ని రాష్ట్రాల్లో నాయకులు బంద్ లో భాగంగా రైల్ రోకో నిర్వహించడంతో రైళ్లు సైతం నిలిచిపోయాయి. బంద్ నేపథ్యంలో విద్యా సంస్థలు, దుకాణాలు, వ్యాపార/వాణిజ్య సంస్థలు కూడా తెరుచుకోలేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బంద్ పూర్తిస్థాయిలో కొనసాగుతుంది. తెలంగాణలో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బంద్ కు సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. ఇక ఏపీ ప్రభుత్వం రైతులకు సంఘీభావం తెలియజేస్తూ మధ్యాహ్నం 1 గంట వరకు ప్రభుత్వ ఆఫీసులు మూసివేత, ఆర్టీసీ బస్సులు నిలిపేయడం, విద్యా సంస్థలకు పూర్తిగా సెలవు ఇస్తున్నట్టు ప్రకటించింది.
తెలంగాణ, ఏపీలలో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోగా, అన్ని చోట్ల దుకాణాలు కూడా మూసివేశారు. పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నాయకులు వినూత్న పద్దతిలో నిరసన తెలుపుతున్నారు. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 13 వ రోజుకు చేరుకుంది. భారత్ బంద్ లో భాగంగా వేలాదిమంది రైతులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు. సామాన్యుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే భారత్ బంద్ నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. అయితే 24 కీలక రాజకీయ పార్టీలు రైతుల భారత్ బంద్ కు మద్దతు తెలపడంతో రైతుల ఆందోళన దేశం అంతటికి వ్యాపించింది. మద్దతు ప్రకటించిన పార్టీలన్ని ఆయా రాష్ట్రాల్లో నాయకులు, పార్టీ శ్రేణులతో బంద్లో పాల్గొంటున్నాయి. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బంద్ ప్రభావం స్వల్పంగా కనిపిస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ