తెలంగాణ రాష్ట్రంలో పండే పత్తి దేశంలోకెల్లా అత్యంత నాణ్యమైనదిగా గుర్తింపు పొందిందని, ప్రపంచంలోకెల్లా అత్యంత నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో తెలంగాణ ఒకటని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. తెలంగాణలో పండే పత్తి స్టేపుల్ పొడవు దేశంలోకెల్లా అత్యంత పొడవుగా ఉంటుంది. గట్టితనం కూడా ఎక్కువ. అత్యంత నాణ్యతతో కూడిన తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ కల్పించేందుకు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ పత్తికున్న విశిష్ట లక్షణాలను గుర్తించి వాటిని ప్రచారం చేయడానికి అవసరమైన వ్యూహం రూపొందించాలని కోరారు. దీనికోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిపుణులతో సదస్సు నిర్వహించాలన్నారు. తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా మరింత డిమాండ్ రావడానికి అనుగుణంగా పత్తి ఏరిన తర్వాత శుద్దిచేయడం, ప్యాక్ చేయడం లాంటి పనులను జాగ్రత్తగా నిర్వహించే విషయంలో రైతులకు సూచనలు ఇవ్వాలి. పత్తిలో ఏ మాత్రం చెత్తాచెదారం, మట్టిపెళ్లలు, దుమ్ము చేరకుండా చూడాలని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయ విస్తరణపై అధికారులతో సీఎం కేసీఆర్ సోమవారం నాడు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు.
దేశంలో ఎక్కువ విస్తీర్ణంలో పత్తిని సాగు చేస్తోన్న రెండో రాష్ట్రం తెలంగాణ:
“దేశంలో ఎక్కువ విస్తీర్ణంలో పత్తిని సాగు చేస్తోన్న రెండో రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుంది. పత్తికి దేశీయంగా, అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంది. తెలంగాణ పత్తి పింజ పొడవు ఎక్కువ కాబట్టి మరింత డిమాండ్ ఉంది. ఇరిగేటేడ్ వాటర్ (సాగు నీరు) ద్వారా సాగు చేసే భూముల్లో పంట మరింత బాగా వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాజెక్టులు కట్టుకున్నందున సాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కాబట్టి కాల్వల కింద పత్తిని సాగుచేస్తే మరింత లాభసాటిగా ఉంటుంది” అని సీఎం కేసీఆర్ అన్నారు.
పత్తికి మంచి మార్కెట్ రావడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు:
“పత్తికి మంచి మార్కెట్ రావడానికి ప్రభుత్వం కూడా అవసరమైన చర్యలు తీసుకుంది. తెలంగాణ ఏర్పడక ముందు జిన్నింగ్ మిల్లుల సంఖ్య 60 మాత్రమే. వాటిని 300కు పెంచేలా చర్యలు తీసుకుంది. పత్తిపంట ఎక్కువ పండే ప్రాంతాల్లో జిన్నింగ్ మిల్లులు నెలకొల్పేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. పత్తిసాగులో అనేక కొత్త పద్దతులు వచ్చాయి. కొత్త వంగడాలు కూడా వచ్చాయి. ఒకేసారి పంట వచ్చే విత్తనాలు వస్తున్నాయి. వాటిని తెలంగాణలో పండించాలి. రైతులు రాష్ట్రంలో లాభసాటి పంటలు పండించేలా చర్యలు ప్రారంభించాం. రైతులు ప్రభుత్వ సూచనలు పాటించి నియంత్రిత పద్దతిలో సాగుచేస్తున్నారు. ఇది మంచి సంప్రదాయం. మార్కెట్ లో నూనెగింజలు, పత్తి, పప్పులకు మంచి డిమాండ్ ఉంది. కూరగాయలకు కూడా మంచి ధర వస్తుంది. కందుల విస్తీర్ణం 20 లక్షలకు పెంచాలి” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ