రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా మే 5, బుధవారం నుంచి కర్ఫ్యూ విధించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 5 నుంచి రెండువారాలు పాటుగా ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ (సెక్షన్ 144) అమలులో ఉండనుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఆ తర్వాత కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇస్తామని తెలిపారు.
మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజా రవాణాతో పాటుగా ప్రైవేటు వాహనాలు రాకపోకలపై నిషేధం విధించారు. అలాగే అంతరాష్ట్ర సర్వీసులు కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి మధ్యాహ్నం 12 తర్వాత రాష్ట్ర సరిహద్దులను మూసివేయనున్నారు. ఈ మేరకు కర్ఫ్యూకు సంబంధించిన మార్గదర్శకాలపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉన్న సేవలు ఇవే:
- ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్లు, మెడికల్ షాపులు.
- ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా.
- టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సేవలు, ప్రసార మరియు కేబుల్ సేవలు, ఐటి మరియు ఐటి ఎనబుల్డ్ సేవలు.
- పెట్రోల్ పంపులు, ఎల్పిజి, సిఎన్జి, పెట్రోలియం మరియు గ్యాస్ అవుట్లెట్లు.
- విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం మరియు పంపిణీ.
- నీటి సరఫరా మరియు పారిశుధ్యం.
- కోల్డ్ స్టోరేజ్ మరియు గిడ్డంగి సేవలు.
- ప్రైవేట్ భద్రతా సేవలు.
- కరోనా నిబంధనలకు అనుగుణంగా అన్ని పరిశ్రమలు, వ్యవసాయ కార్యకలాపాలకు అనుమతి.
కర్ఫ్యూ సమయంలో కదలికలకు అనుమతి ఉన్న వర్గాలివే:
- అత్యవసర సేవలు, కార్యకలాపాలలో నిమగ్నమైన వ్యక్తులు.
- భారత ప్రభుత్వ అధికారులు, ఏపీ ప్రభుత్వ అధికారులు మరియు ఏపీ పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీ రాజ్ సంస్థల ఎమెర్జెన్సీ డ్యూటీ అధికారులు(చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు తప్పనిసరి).
- వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడిక్స్ వంటి అన్నిరకాల ప్రైవేట్ వైద్య సిబ్బంది మరియు ఇతర ఆసుపత్రి సేవల ప్రొవైడర్స్ (చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు తప్పనిసరి).
- వైద్య సంరక్షణ అవసరమున్న గర్భిణీ స్త్రీలు మరియు రోగులు.
- అనుమతి ఇచ్చిన ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు వచ్చే వ్యక్తులు.
- ఆరోగ్య సంరక్షణ సేవలను పొందటానికి ప్రైవేట్ వాహనాల్లో వ్యక్తుల రవాణాకు అనుమతి.
- విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల నుండి వచ్చే లేదా వెళ్లే వ్యక్తులు చెల్లుబాటు అయ్యే టికెట్ చూపించాల్సి ఉంటుంది.
- ఇంటర్-స్టేట్ మరియు ఇంట్రా-స్టేట్ కు సంబంధించి అవసరమైన మరియు అవసరం లేని వస్తువుల కదలిక/రవాణా వంటి వాటిపై ఎటువంటి పరిమితి ఉండదు.
- ఆటోలు, టాక్సీలు, సిటీ బస్సు సేవలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే అనుమతి.
- అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లాల ప్రజా రవాణా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతి.
- ఇప్పటికే నిర్ణయించిన పెళ్లిళ్లు జరుపుకునేందుకు స్థానిక అధికారుల నుంచి అనుమతి తప్పనిసరి. వివాహాలు, ఇతర శుభకార్యాలకు గరిష్టంగా 20 మందితో అనుమతి.
- కర్ఫ్యూపై నిబంధనలు వెంటనే అమలులోకి వస్తాయి. అలాగే మే 5, 2021 మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు వారాలు పాటుగా అమలులో ఉంటాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ