కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతోంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ పలువురు కాశ్మీరీ పండిట్లతో సమావేశమయ్యారు. అలాగే జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. మంగళవారం యాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళా మటోండ్కర్ పాల్గొన్నారు. ఈరోజు ఉదయం నగ్రోటా పట్టణం వద్ద తిరిగి ప్రారంభమయిన యాత్రలో ఆమె చేరారు. కాగా గతంలో ఊర్మిళ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. అనంతర పరిణామాలలో ప్రస్తుతం శివసేన పార్టీలో కొనసాగుతున్నారు. ఇక ఊర్మిళా మటోండర్ రాహుల్ గాంధీతో కలిసి నడిచిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిలో.. ‘ఐక్యత, అనుబంధం, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం కోసం ఈ నడక’ అని ఆమె ట్వీట్ చేశారు.
అలాగే అంతకుముందు కూడా ఆమె ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. అందులో.. ‘ఈ శీతాకాలపు చలిలో, నేను జమ్మూ నుండి మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. కొద్దిసేపట్లో నేను యాత్రలో చేరతాను. భారతీయ ఐక్యతా స్ఫూర్తిని ఈ యాత్రలో చూశాను. మనమందరం కలిసి ఈ భారతదేశ సౌభ్రాతృత్వ భావనను మరింత ఎదగడానికి సహకరించాలి. ఈ యాత్ర రాజకీయాలకు అతీతమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రపంచం ప్రేమతో పనిచేస్తుంది, ద్వేషంతో కాదు’ అని పేర్కొన్నారు. కాగా సెప్టెంబరులో జోడో యాత్ర ప్రారంభమైనప్పటి నుండి చాలా మంది ప్రముఖులు, పలువురు నటీ,నటులు రాహుల్ యాత్రలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. వీరిలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, సీనియర్ ఆర్మీ అధికారులు, పూజా భట్, కమల్ హాసన్ సహా పేరొందిన క్రీడాకారులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE