కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నాక తొలిసారిగా కేబినెట్ సమావేశం నిర్వహించింది. ఏప్రిల్ 6, సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ కేబినెట్ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు:
- ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, ఎంపీల వేతనాల్లో ఏడాదిపాటు 30 శాతం కోతకు సంబంధిన ఆర్డినెన్స్ కు ఆమోదం.
- ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి వేతనాల్లో కోత వర్తింపు.
- కరోనాపై పోరాడేందుకు నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం.
- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పలువురు గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు స్వచ్ఛందంగా వేతనాల కోతకు అంగీకారం తెలిపారు.
- వేతనాల కోత ద్వారా మిగిలే నిధులను కన్సాలిడేషన్ ఫండ్కు జమ.
- రెండేళ్ల పాటు ఎంపీ లాడ్స్ నిధులు నిలిపివేయాలని నిర్ణయం.
- ఎంపీ లాడ్స్ ద్వారా సమకూరే రూ.7900 కోట్లు కూడా కన్సాలిడేషన్ ఫండ్కు జమ చేయనున్నారు.
- ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తూ లాక్డౌన్ పై సరైన సమయంలో నిర్ణయం.