భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా వ్యాప్తి చెందుతుంది. ఏప్రిల్ 6 సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4067కి చేరగా, ఈ వైరస్ వలన ఇప్పటివరకు 109మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా రూపొందించిన లఘు చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో సహా పలువురు నటీనటులు నటించారు.
ప్రసూన్ పాండే దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిలింలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తుండగా, మిగిలిన నటీనటులు కూడా భాగం పంచుకున్నారు. కరోనా వైరస్ ప్రభావం, లాక్డౌన్ అమలు సందర్భంగా ఇంటిలోనే ఉండి జాగ్రత్తలు తీసుకోవడం, సామాజిక దూరం పాటించడం, పరిశుభ్రతను పాటించడం వంటి అంశాలను ఈ షార్ట్ ఫిలిం ద్వారా వివరించినట్టు తెలుస్తుంది. ఫ్యామిలీ అనే పేరుతో రూపొందించిన ఈ షార్ట్ ఫిలిం ఏప్రిల్ 6, సోమవారం రాత్రి 9 గంటలకు సోనీ నెట్వర్క్లో ప్రసారం కానున్నట్టు సమాచారం.
[subscribe]