భారత ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాల అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్తి స్థాయి వాటాలు అమ్మకానికి పెట్టడంతో ఎయిర్ ఇండియా ఇకపై ప్రైవేటుపరం కానుంది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎయిర్ ఇండియా 100 శాతం వాటాను, జాయింట్ వెంచర్ అయిన ఎయిర్ ఇండియా సాట్స్లో 50 శాతం వాటాను విక్రయించనున్నట్లు జనవరి 27, సోమవారం నాడు విడుదల చేసిన బిడ్ పత్రంలో కేంద్రం ప్రకటించింది. ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయాలనుకునే సంస్థలు మార్చి 17లోగా ప్రాథమిక బిడ్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. అలాగే ఎయిర్ ఇండియా కొనుగోలుపై ఆసక్తి చూపించేవాళ్ళు సంస్థ ఆస్తులతో పాటుగా సంస్థకున్న సుమారు 3.26 బిలియన్ డాలర్లు రుణాలను కూడా స్వీకరించాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
మరోవైపు ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్, ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్, ఎయిర్ లైన్ అలైడ్ సర్వీసెస్ మరియు హోటల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా విభాగాలను ఎయిర్ ఇండియా అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్ (ఏఐఏహెఛ్ఎల్ ) అనే ప్రత్యేక సంస్థకు బదిలీ చేస్తున్నారు. ఎయిర్ ఇండియా అమ్మకానికి ప్రతిపాదించిన లావాదేవీలో ఈ విభాగాలు భాగం కాదని ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ విమానయాన సేవల మార్కెట్లో ఎయిర్ ఇండియా 18.6 శాతం వాటా కలిగి ఉండగా, సంస్థలో ఇరవై వేల మందికి పైగా ఉద్యోగులను పనిచేస్తున్నారు.
[subscribe]