ఓటర్ల జాబితాలో బోగస్ కార్డులను ఎత్తివేసే దిశగా త్వరలో ఓటర్కార్డును కూడా ఆధార్తో అనుసంధానం చేసే పక్రియ ప్రారంభించేందుకు కేంద్రప్రభుత్వం సిద్దమవుతుంది. ఓటర్ ఐడీ- ఆధార్ కార్డును అనుసంధానం చేసేందుకు ఎన్నికల సంఘం చట్టబద్దమైన అనుమతి కోరుతూ చేసిన విజ్ఞప్తికి కేంద్ర న్యాయశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు కొత్త చట్టం కోసం నోట్ తయారీ చేసి, కేబినెట్ సమావేశంలో ఆమోదించనున్నారు. అలాగే జనవరి 31 నుంచి జరగబోయే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం ప్రతిపాదన ప్రకారం, ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉన్నవారితో పాటుగా ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలనుకునేవారు సైతం వారి ఆధార్ వివరాలను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కు (ఈఆర్వో) ఇవ్వాల్సి ఉంటుంది. 2015 ఆగస్టులో ఓటర్ ఐడీ- ఆధార్ అనుసంధానం కోసం చట్టం యొక్క అనుమతి తప్పనిసరని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల చట్టంలో మార్పులు కోరుతూ ఎన్నికల సంఘం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టుగా తెలుస్తుంది. ఈ అనుసంధానం ద్వారా ఒకే పేరుపై ఒకటికి మించి ఉన్న బోగస్ ఓటర్ ఐడీ కార్డులను ఏరివేసే వీలుంటుందని ఎన్నికల సంఘం భావిస్తుంది.
[subscribe]