తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించడంపై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, టిఆర్ఎస్ కీలక నాయకుడు, మంత్రి హరీష్ రావు స్పందించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, 2014 నుంచి చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లే ఈ ఎన్నికల్లో ఇంతటి భారీ విజయం లభించిదని చెప్పారు. ఈ స్థాయి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ ఫలితాలు మున్సిపల్ శాఖ మంత్రిగా తన బాధ్యతను మరింత పెంచాయని పేర్కొన్నారు. ఈ ఫలితాల్లో కొన్నాళ్లుగా కాంగ్రెస్కు కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ సంచలనం విజయాలను నమోదు చేసింది.
మంత్రి హరీష్ రావు ట్విట్టర్లో స్పందిస్తూ ‘ ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టిఆర్ఎస్ దేనని మరోసారి రుజువు చేశారు తెలంగాణ ప్రజలు. మున్సిపల్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ప్రభంజనమే వీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అభినందనలు. ప్రత్యర్థులు అందుకోలేని స్థాయిలో టిఆర్ఎస్ కు తిరుగులేని ఫలితాలు సాధించడంలో కష్టపడిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, మరీ ముఖ్యంగా కార్యకర్తలకు అభినందనలు. బంగారు తెలంగాణ సాధన కేసీఆర్ సారధ్యంలోని ఒక్క టిఆర్ఎస్ కే సాధ్యమని చాటిన ప్రజానికానికి మనఃపూర్వక కృతజ్ఞతలని’ పేర్కొన్నారు. మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకు రానున్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించే మీడియా సమావేశంలో ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు.
[subscribe]