భారత్ తదుపరి అటార్నీ జనరల్ (ఏజీ)గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్.వెంకటరమణి నియమితులయ్యారు. ప్రస్తుత ఏజీ కేకే వేణుగోపాల్ పదవీకాలం సెప్టెంబరు 30తో ముగియనుంది. దీంతో ఆయన నుంచి తదుపరి ఏజీగా వెంకటరమణి బాధ్యతలు స్వీకరించనున్నారు. ముందుగా ఆర్.వెంకటరమణిని ఏజీగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిర్ణయం తీసుకున్నారని, బాధ్యతలు తీసుకున్న తేదీ నుంచి మూడేళ్ల పాటుగా ఆయన ఆ పదవిలో కొనసానున్నారని కేంద్ర లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రస్తుత ఏజీ కేకే వేణుగోపాల్ అనంతరం సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తదుపరి ఏజీగా బాధ్యతలు చేపట్టనున్నట్లు ముందుగా వార్తలు వచ్చాయి. రోహత్గీ మొదటిసారి 2014 జూన్ 19 నుంచి 2017 జూన్ 18 వరకు ఏజీగా ఉన్నారు. అయితే రెండోసారి ఏజీగా బాధ్యతలు చేపట్టే ప్రతిపాదనకు రోహత్గీ అంగీకారం తెలుపకపోవడంతో, కేంద్రం మరోసారి కసరత్తు జరిపి వెంకటరమణి నియామకంపై నిర్ణయం తీసుకుంది.
ఆర్.వెంకటరమణి 1950, ఏప్రిల్ 13న పాండిచ్చేరిలో జన్మించారు. 1977, జూలై లో తమిళనాడు బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు మరియు 1979లో తన ప్రాక్టీస్ను ఢిల్లీలోని సుప్రీంకోర్టుకు మార్చారు. 1997లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డారు. కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ రంగ సంస్థలకు తరపున ప్రాతినిధ్యం వహిస్తూ సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల్లో పలు అంశాల్లో వాదనలు వినిపించారు. 2010 మరియు 2013లో లా కమిషన్ ఆఫ్ ఇండియా సభ్యునిగా కూడా వెంకటరమణి పనిచేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY