తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్య శాఖ దాడులు కొనసాగిస్తోంది. నిబంధనలకు విరుద్దంగా నిర్వహించబడుతున్న ఆసుపత్రులపై కొరడా ఝళిపిస్తోంది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ప్రైవేటు హాస్పిటల్స్పై వేటు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్లపై గత నాలుగు రోజులనుంచి వైద్య శాఖ దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి వరకు మొత్తం 1,569 ఆసుపత్రులను తనిఖీ చేయగా.. వాటిలో నిబంధనల ప్రకారం లేని 81 ఆసుపత్రులను సీజ్ చేశారు. అలాగే 600కి పైగా ఆసుపత్రులకు నోటీసులు జారీ చేయగా, మరో 68 ఆసుపత్రులకు జరిమానాలు విధించారు.
అత్యధికంగా కరీంనగర్లో 210, రంగారెడ్డిలో 204, భద్రాద్రి కొత్తగూడెంలో 132, హైదరాబాద్లో 130 ఆసుపత్రులను తనిఖీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆయా ఆసుపత్రులు నోటీసులపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని, లేనియెడల వాటిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఇక రాష్ట్రంలోని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద అల్లోపతి పరిధిలోకి రాని ఆస్పత్రులు, తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు ఇప్పటికే సూచించారు. అలాగే అర్హత లేకుండా శస్త్ర చికిత్సలు, అబార్షన్లు చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY