దేశంలో కోవిడ్ మహమ్మారిపై నిఘా, నియంత్రణ మరియు జాగ్రత్త కోసం జూలై 29, 2021 నుంచి అమల్లో ఉన్న మార్గదర్శకాలను ఆగస్టు 31, 2021 వరకు పొడిగిస్తునట్టు కేంద్ర హోమ్ శాఖ వెల్లడించింది. అధిక పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో కరోనా నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు బుధవారం కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.
“యాక్టీవ్ కేసుల సంఖ్య తగ్గుతుండడంతో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు క్రమంగా కార్యకలాపాలను తిరిగి తెరుస్తున్నాయి. కేసుల సంఖ్య తగ్గడం సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, సంపూర్ణ కేసు సంఖ్యలు ఇప్పటికీ గణనీయంగానే ఉన్న విషయాన్ని గుర్తించాలి. అందువలన ఎలాంటి అశ్రద్ధకు చోటులేకుండా, పరిమితులను సడలించే ప్రక్రియను జాగ్రత్తగా అమలు చేయాలి. సాధారణంగా ‘R’ ఫ్యాక్టర్ గా పిలువబడే వైరస్ యొక్క పునరుత్పత్తి సంఖ్య 1 కంటే తక్కువగా ఉంది, కానీ కొన్ని రాష్ట్రాలలో ఇది ఎక్కువగా ఉంది. “R” ఫ్యాక్టర్ లో పెరుగుదల లేకుండా అన్ని ప్రయత్నాలు చేయాలి. ఇంకా పాజిటివిటీ రేటు ఎక్కువుగా ఉన్న జిల్లాల్లో కఠినమైన చర్యలు తీసుకోవాలి” అని రాష్ట్రాలకు సూచించారు.
“రాబోయే పండుగల దృష్ట్యా, అన్ని రద్దీ ప్రదేశాలలో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. కోవిడ్ -19 యొక్క సమర్థవంతమైన నిర్వహణ కోసం టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలు పాటించడం అనే ఐదు అంశాల వ్యూహంపై నిరంతరం దృష్టి పెట్టాలి. కోవిడ్-19 నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా మరియు సంబంధిత స్థానిక అధికారులందరికీ కఠినమైన ఆదేశాలు జారీ చేయాలి. కోవిడ్ నిబంధనలు అమలు చేయడంలో ఏవైనా అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులు వ్యక్తిగతంగా బాధ్యత వహించాలి. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రభుత్వాలు కోవిడ్ నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయాలని, ప్రతిఒక్కరూ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలి” అని అజయ్ భల్లా లేఖలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ