అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం.. అన్న కవి మాటలు నేడు సాక్షాత్కరిస్తున్నాయి. అయోధ్య రామజన్మభూమి వివాదానికి చరమగీతం పాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాక అనతికాలంలోనే రామమందిరాన్ని నిర్మించిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రమే కాక దేశం, ప్రపంచవ్యాప్తంగానూ రామమందిర ప్రారంభోత్సవానికి ఎందరో ఎంతో ప్రాధాన్యమిస్తున్నారు.బహుశా పాలనలోనూ రామరాజ్యాన్ని మించింది లేదన్న ప్రచారం కూడా ఇందుకు కారణమై ఉండవచ్చు. దీనికి తోడు.. కేంద్ర ప్రభుత్వం అయోధ్యను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంపై విస్తృత ప్రచారం కల్పించడం, మోదీ ఉపవాస దీక్షలు, పూజలు ఇవన్నీ జగమంతా రామమయం కావడానికి దోహదపడ్డాయి.
మంచి పాలనకు పర్యాయపదంగా రామరాజ్యం అని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ రాజ్యంలో ధర్మం, నీతి వర్థిల్లాయి. ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ఒక రాజు .. ఒక ప్రభుత్వం ఎలా ఉండాలో చాటి చెప్పిన రాజ్యంగా ప్రచారంలో ఉంది. దేవునికంటే కూడా పాలకునిగా రాముని మించిన లేరనేది తరతరాలుగా పెద్దలు చేస్తున్న హితబోధ. పాలకుడు, దేవుడూ కూడా అయినందున కాబోలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఆ రాముడి మందిర ప్రారంభోత్సవానికి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయి. ఆధ్యాత్మికత విల్లి విల్లివిరుస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. శ్రీరాముని మందిర నిర్మాణం జరిగింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో అయినప్పటికీ పల్లె, పట్టణమనే తేడా లేకుండా విశ్వవ్యాప్తంగా రామనామ జపం చేస్తున్నారు. ఎంతో మంది కవులు, కళాకారులు అయోధ్య స్ఫూర్తితో అద్భుత బాణిలను కడుతున్నారు. అత్యద్భుత కళాఖండాలను సృష్టిస్తున్నారు. ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గిన్నెస్ రికార్డ్ హోల్డర్, డాక్టర్ గుర్రం దయాకర్ బియ్యం గింజలతో అయోధ్య రామాలయ నమూనాను రూపొందించారు. తెలంగాణ నుంచి నాగర్కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలానికి చెందిన స్వర్ణకారుడు కపిలవాయి గోపి చారి కూడా రామయ్యపై భక్తితో తన స్వర్ణ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. కేవలం 2.73 మిల్లిగ్రాముల బంగారంతో గోరంత సైజులో ఆయోధ్య రామాలయం నమూనాను తయారుచేసి ఆకర్షించారు.
అదిలాఉంటే.. అయోధ్య రాముని కోసం ఎక్కడెక్కడి నుంచో ఎందరెందరో ఎన్నో విధాలుగా తమ సేవలందిస్తున్నారు. రామపాదుకలతో పాదయాత్రలు చేస్తున్నారు. ఉడతాభక్తిగానే కాబోలు తమకు వచ్చిన కళతో రామునికి తమవంతు సేవ చేస్తున్నారు. ప్రసాద వితరణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పలు ఫోన్లలో రాముడే డీపీగా మారాడు. పాటలూ, కాలర్ట్యూన్లూ రామనామ జపమే చేస్తున్నాయి. హోర్డింగ్ల్లోనూ రాముడే కనిపిస్తున్నాడు. రామ్లల్లా ప్రాణప్రతిష్ట ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రామజ్యోతి వెలిగించడం ద్వారా తమ ఇళ్లలో కొత్త వెలుగులు వస్తాయని విశ్వసిస్తున్నవారెందరో ఉన్నారు. అదే తరుణంలో తమ ఇంటికింకా అక్షింతలు రాలేదని వేదన చెందుతూ, తమపై రాముని కటాక్షం ఉండదా అని తల్లడిల్లుతూ వాటికోసం ప్రయత్నిస్తున్న వారూ ఉన్నారు.
రామాలయ ప్రారంభోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని రామభక్తుడైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కఠిన దీక్షలు చేస్తుండటం తెలిసిందే.పలు ,పట్టణాల్లోనూ ప్రజలు సామూహికంగా ప్రతినలు బూనుతున్నారు. సోమవారం రామ్లల్లా ప్రాణప్రతిష్ట జరగనుండగా, మూడు రోజుల ముందుగా నేటి నుంచే మద్యం, మాంసానికి దూరంగా ఉండాలని తీర్మానిస్తున్నారు. ఇక ప్రత్యేక బస్సులు, రైళ్లు మాత్రమే కాదు వీఐపీల చార్డర్డ్ ఫైట్లూ ప్రయాణానికి సిద్ధమవుతున్నాయి. మరో విషయం ఏంటంటే.. భోగవిలాస రాష్ట్రంగా పేరు పడ్డ థాయ్లాండ్లోనూ భక్తి పారవశ్యం కనిపిస్తోంది. థాయ్లోని పలు నగరాల్లోని ఆలయాల్లో రామభజనలు, దీపోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. దేశంలోని కొన్ని ఆలయాల్లోనూ రాముని విగ్రహ ప్రతిష్ట ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒడిశా నయాగడ్ జిల్లాలోని ఫతేగఢ్ లోనూ ఏడేళ్లుగా నిర్మాణం జరిగిన ఆలయంలో రాముని ప్రాణప్రతిష్ట జరగనుంది.కర్నాటకలో హునుమంతుని జన్మస్థలిగా భావించే కిష్కింధనుంచి బయలు దేరిన ప్రత్యేక రథం ఇప్పటికే అయోధ్య చేరుకుంది. రాబోయే ఎన్నికలు.. ఓట్ల రాజకీయం అనే విమర్శలు చేస్తున్నవారు కూడా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం అంతటా కనిపిస్తున్నది మాత్రం శ్రీరాముడే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ