తమిళనాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, కన్యాకుమారి ఎంపీ హెచ్.వసంత్కుమార్ ఆగస్టు 28, శుక్రవారం నాడు కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. హెచ్.వసంత్కుమార్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆగస్టు 10 నుండి చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్ సపోర్ట్ తో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో శుక్రవారం నాడు ఆయన తుదిశ్వాస విడిచారు. 1978 లో వసంత & కో పేరుతో అతిపెద్ద రిటైల్ చైన్ ను వసంత్కుమార్ స్థాపించారు. తమిళనాడు రాష్ట్రంలో 82 షోరూమ్స్ తో అత్యంత విజయవంతమైన ఎలక్ట్రానిక్ మరియు గృహోపకరణ సంస్థలలో ఒకటిగా ఇది కొనసాగుతుంది.
రాజకీయాల్లో కూడా వసంత్కుమార్ తనదైన ముద్ర వేశారు. 2006లో తొలిసారిగా నంగునెరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2016లో కూడా అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచాక ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కన్యాకుమారి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ పార్టీ అభ్యర్థిని 2,50,000 ఓట్ల తేడాతో ఓడించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్కు ఎంపీ వసంత్కుమార్ బంధువు అవుతారు. ఎంపీ హెచ్.వసంత్కుమార్ మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు, పలు పార్టీల నేతలు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu