ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన తర్వాత.. తొలిసారిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రేపు సాయంత్రం సమావేశమవునుంది. పార్టీ నాయకత్వంపై సీనియర్లు అసంతృప్తిగా ఉన్న సమయంలో దీనిపై కూడా సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. గురువారం ప్రకటించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం పాలయ్యింది. దేశంలో అధికారంలో ఉన్న ప్రధాన రాష్ట్రాల్లో ఒకటైన పంజాబ్ను కూడా కోల్పోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దెబ్బకు పంజాబ్లో దిగ్గజ నాయకులు ఓటమి చెందటం విశేషం. అలాగే, మరో మూడు రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్, గోవా మరియు మణిపూర్ లలో కూడా విఫలమైంది.
ఇక పార్టీ అగ్ర నేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలో ప్రచారం జరిగిన ఉత్తరప్రదేశ్లో, మొత్తం 403 సీట్లలో కాంగ్రెస్ కేవలం 2 సీట్లు మాత్రమే సాధించింది. ఆ పార్టీకి కేవలం 2.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఓటమితో పార్టీలోని సీనియర్లు, అసమ్మతివాదులు ఒక్కసారిగా గాంధీ కుటుంబంపై విమర్శల తీవ్రతను పెంచారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్, గురువారం నాడు, పార్టీ మార్పును నివారించలేమని ట్వీట్ చేయటం విశేషం. మరోవైపు కొంతమంది అసమ్మతివాదులు నిన్న సాయంత్రం పార్టీలోని ప్రముఖ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఇంటిలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించడానికి ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకోనందుకు కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం.
సరైన నాయకత్వం లేకపోవటం వల్లనే పార్టీ క్రమేపి పతనమవుతోందని విమర్శించే నాయకుల సంఖ్య పార్టీలో పెరుగుతోంది. అయితే, గాంధీ కుటుంబ విధేయులు మాత్రం తమ నాయకత్వాన్ని సమర్థించారు. పార్టీ అగ్ర నేత, కర్ణాటక పీసీసీ చీఫ్ డికె శివకుమార్ శుక్రవారం మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉండదని, కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు వారే కీలకమని పేర్కొన్నారు. గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ మనుగడ అసాధ్యం అని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో.. సోనియా గాంధీ నేతృత్వంలో రేపు వీటన్నింటిపై చర్చించటానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమవుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ