తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ ఎన్నికకు శనివారం నాడు నోటిఫికేషన్ జారీ అయింది. ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చైర్మన్ ఎన్నికకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇక మార్చి 14, సోమవారం ఉదయం శాసనమండలిలో చైర్మన్ పదవికి ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్ గా మజ్లిస్ ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హజన్ జాఫ్రీ వ్యవహరిస్తున్నారు.
ముందుగా గత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ల పదవీకాలం ముగిసిన అనంతరం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ వి.భూపాల్ రెడ్డిని ప్రొటెం చైర్మన్గా నియమించారు. భూపాల్ రెడ్డి కూడా జనవరి 4, 2022తో పదవీవిరమణ పొందిన నేపథ్యంలో ప్రొటెం చైర్మన్గా శాసనమండలిలో మజ్లిస్ పక్ష నేతగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ అమీనుల్ హజన్ జాఫ్రీకి అవకాశమిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల శాసనమండలిలోని ఖాళీలన్నీ భర్తీకావడంతో సోమవారం పూర్తిస్థాయి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డికే మరోసారి అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. డిప్యూటీ ఛైర్మన్ గా ఎవరికీ అవకాశం ఇస్తారనే విషయంపై చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మండలిలో టీఆర్ఎస్ పార్టీకే పూర్తిస్థాయి మెజారిటీ ఉండడంతో రెండు పదవులకు కూడా టీఆర్ఎస్ అభ్యర్థులే ఏకగ్రీవం ఎన్నిక కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ