ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలయిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అయితే దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలయిన పిటిషన్లపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. ఈ మేరకు సోమవారం తుది తీర్పును వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని ధర్మాసనం వెల్లడించింది.
ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకున్న నిర్ణయమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అలాగే పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టిపారేయలేమనని తేల్చి చెప్పింది. ఆర్టికల్ 370 యుద్ధ నేపథ్యంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని.. శాశ్వతం కాదని ధర్మాసనం పేర్కొంది. జమ్మూ కశ్మీర్కు సార్వభౌమాధికారం లేదని తెలిపింది. హక్కుల విషయంలో జమ్మూ కశ్మీర్కు ప్రత్యేకత ఏమీ లేదన్న ధర్మాసనం.. మిగిలిన రాష్ట్రాలతో, కేంద్రపాలిత ప్రాంతాలతో జమ్మూ కశ్మీర్ సమానమేనని స్పష్టం చేసింది.
ఇకపోతే 2019 ఆగష్టు 5న జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ.. ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కానీ స్థానిక రాజకీయ పార్టీలు అంగీకరించలేదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయా పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఆ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఈ ఏడాది ఆగష్టు 2 నుంచి సెప్టెంబర్ వరకు విచారణ చేపట్టింది. ఆ తర్వాత సెప్టెంబర్ 5న తుది తీర్పును రిజర్వ్లో పెట్టిన ధర్మాసనం.. సోమవారం వెలువరించింది.
ఇక ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కశ్మీర్లో రాష్ట్ర హోదాను పునరుద్ధించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే 30 సెప్టెంబర్ 2024లోగా జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE