భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గత రెండ్రోజులుగా రోజుకి 2 వేలకు పైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మే 4, సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 42,533 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2533 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక దేశంలో కరోనా మరణాలు సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1373 కి చేరింది. మరోవైపు కరోనా బాధితుల్లో 11707 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 29453 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువుగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే 12,974 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 2115 మంది కోలుకోగా, 548 మంది మరణించారు. దేశంలో అత్యధిక కరోనా మరణాలు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత గుజరాత్ లో అత్యధికంగా 5,428, ఢిల్లీలో 4,549 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో 1000 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 12,974
- గుజరాత్ – 5,428
- ఢిల్లీ – 4,549
- తమిళనాడు – 3,028
- రాజస్థాన్ – 3,009
- మధ్యప్రదేశ్ – 2,837
- ఉత్తర ప్రదేశ్ – 2,645
- ఆంధ్రప్రదేశ్ – 1,583
- పంజాబ్ – 1,102
- తెలంగాణ – 1,082
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu