లాక్డౌన్ కారణంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు చేరవేసేందుకు రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ తమ సొంత గ్రామాలకు వెళ్లాలనుకుంటున్న వలస కూలీల రైలు ఛార్జీలు ఆయా రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ శాఖలే భరిస్తాయని కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ రోజు ప్రకటించారు. వలస కూలీలు సొంత గ్రామాలకు వెళ్లేందుకు రైలు ప్రయాణ ఖర్చులకు కూడా డబ్బులు లేక కాలినడకనే బయలుదేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. వలస కూలీల ప్రయాణ ఖర్చులపై కేంద్రం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతోనే కాంగ్రెస్ పార్టీ వారి ప్రయాణ ఖర్చు భరిస్తుందని పేర్కొన్నారు.
పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను వారి ప్రాంతాలకు క్షేమంగా, ప్రభుత్వ ఖర్చులతో తరలించాలని కాంగ్రెస్ పార్టీ చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కూలీల కష్టాల్ని తీర్చడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని సోనియా గాంధీ విమర్శించారు. విదేశాల్లోనిలిచిపోయిన వారిని ప్రత్యేక విమానాల్లో దేశానికి తరలించిన ప్రభుత్వం, కూలీలను మాత్రం ఉచితంగా సొంత గ్రామాలకు పంపించలేరా అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాల పీసీసీ నేతలను వలస కూలీల రైళ్ల ఖర్చులు భరించి అండగా నిలవాలని సోనియా గాంధీ పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu