కేరళలోని కోజికోడ్లో ఆగస్టు 7, శుక్రవారం రాత్రి ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వందేభారత్ మిషన్లో భాగంగా దుబాయ్ నుంచి కోజికోడ్కు చేరుకున్న ఎయిరిండియాకు చెందిన విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో రన్ వే పై నుంచి ఒక్కసారిగా పక్కకు దూసుకెళ్లి రెండుగా విరిగిపోయింది. ప్రమాదానికి గురైన బోయింగ్ 737 ఐఎక్స్-1344 ఎయిర్ ఇండియా విమానంలో 174 ప్రయాణికులు, 10 మంది చిన్నారులు, ఆరుగురు సిబ్బంది సహా మొత్తం 190 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 18 మంది మరణించగా, 100 మంది పైగా గాయపడ్డారు.
ఈ విమాన ఘటనపై సమగ్ర దర్యాప్తునకు కేంద్రం రెండు బృందాలను నియమించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)కు చెందిన అధికారులు ఇప్పటికే కోజికోడ్ విమానాశ్రయానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. మరోవైపు విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఈ రోజు కేరళ సీఎం పినరయ్ విజయన్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సందర్శించనున్నారు. ప్రయాణికుల బంధువులు సంప్రదించేందుకు కేరళ ప్రభుత్వం హెల్ప్లైన్ నంబర్ 0495-2376901 ను ఏర్పాటు చేయగా, ఎయిర్ ఇండియా సంస్థ 1800 222271 హెల్ప్లైన్ నంబర్ ను ఏర్పాటు చేసింది.
కోజికోడ్ విమాన ప్రమాద ఘటనపై పలువురు ప్రముఖులు స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు ఈ ఘోర ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, గాయపడ్డ వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu