దేశంలో ఇప్పటివరకు మొత్తం 28మందికి కోవిడ్-19(కరోనా వైరస్) సోకినట్లు మార్చ్ 4, బుధవారం నాడు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. భారత పర్యటనకు వచ్చిన 15 మంది ఇటలీ దేశీయులకు కరోనా వైరస్ సోకినట్టు వెల్లడించారు. వారిని ఢిల్లీలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) క్యాంపులో ఉంచి పర్యవేక్షిస్తునట్టు తెలిపారు. అలాగే ఢిల్లీలో కరోనా సోకినా వ్యక్తి కుటుంబానికి కూడా కరోనా సోకినట్టు గుర్తించామని తెలిపారు. ఆగ్రాలో నివసిస్తున్న వారి కుటుంబంలోని ఆరుగురికి కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. అదేవిధంగా పలువురు అనుమానితుల నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని విమానాశ్రయాల్లో తనిఖీలు, ముందస్తుచర్యలు చేపడుతున్నామని, పలు దేశాల నుంచి వచ్చే వారికి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేస్తున్నామని తెలిపారు. ఢిల్లీతో పాటుగా దేశవ్యాప్తంగా మరిన్ని ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు సంఖ్య పెంచాలని ఆదేశించామని ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేగింది. దక్షిణ కొరియా వెళ్లి వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు. ముందుగా హైదరాబాద్లోని అధికారులు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డికి వివరాలు అందజేశారు. దీంతో అనుమానిత వ్యక్తిని గుర్తించిన జిల్లా అధికారులు అతన్ని కాకినాడ జీజీహెచ్కు తరలించారు. జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీ ఎయిర్పోర్టులో అతనికి స్క్రీనింగ్ టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చిందని, గత రెండ్రోజులుగా ఆ వ్యక్తి జలుబుతో బాధపడుతున్నాడని తెలిపారు. దీంతో రక్త నమూనాలను సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి పంపించాం. రక్త నమూనా ఫలితాలు వచ్చిన తర్వాతే కరోనా వైరస్ ఉందో లేదో నిర్ధారణ అవుతుందని తెలిపారు.
అదేవిధంగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మార్చ్ 3, మంగళవారం నాడు పరీక్షలు నిర్వహించిన 45 మంది కరోనా అనుమానితుల రిపోర్టులు నెగిటివ్ వచ్చాయని డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మరో ఇద్దరి శాంపిల్స్ పుణె వైరాలజీ ల్యాబ్కు పంపామని, ఫలితాలు గురువారం వచ్చే అవకాశముందని వెల్లడించారు. ఇద్దరిలో ఒకరు ఇటలీ వెళ్లి వచ్చిన వ్యక్తి కాగా, మరొకరు ఇటీవల కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తితో నేరుగా కాంటాక్ట్లో ఉన్నాడని తెలిపారు. నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన 45 మందిని గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి, 14 రోజుల పాటుగా హౌస్ ఐసోలేషన్లో ఉండాలని సూచించామని పేర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్ రహేజా ఐటీ పార్కులోని ఓ ఉద్యోగికి కరోనా లక్షణాలు ఉన్నాయంటూ కలకలం రేగింది. ఈ నేపథ్యంలో రహేజా పార్కులో ఉన్న ఐటీ ఉద్యోగులు అందరినీ ముందు జాగ్రత్తల చర్యల్లో భాగంగా పోలీసులు ఇళ్లకు పంపుతున్నారు.
[subscribe]