ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మార్చ్ 4, బుధవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి వివిధ కీలక అంశాలపై చర్చించారు. ఎన్పీఆర్ అంశం, భోగాపురం ఎయిర్పోర్ట్, రామాయపట్నం పోర్టు నిర్మాణాలపై ఈ సమావేశంలో చర్చించారు. అలాగే ఉగాది రోజున రాష్ట్రంలో 25లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ, బడ్జెట్ ప్రణాళికలు వంటి అంశాలపై కీలకంగా చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.
ఉగాది పండుగ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 26లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్నినాని తెలిపారు. అలాగే ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేసేందుకు 43,141 ఎకరాల భూమిని సిద్దం చేశామని, ఇందుకోసం 26,976 ఎకరాల ప్రభుత్వ భూమి, 16,164 ప్రైవేటు భూమిని సేకరించామని అన్నారు. ఈ స్థలాలలో ప్లాట్లు అభివృద్ధి చేసి త్వరితగతిన లబ్ధిదారులకు అందిజేస్తామని, ఆ కాలనీలన్నింటికీ వైఎస్ఆర్ జగనన్న కాలనీలుగా నామకరణం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
[subscribe]