కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో అన్ని కంటైన్మెంట్ జోన్లలో నవంబర్ 30 వరకు లాక్డౌన్ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి మంగళవారం నాడు కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలను జారీ చేసింది. కాగా సెప్టెంబర్ 30న జారీ చేసిన అన్లాక్ 5.0 మార్గదర్శకాలే మరో నెల రోజులు పాటుగా, అనగా నవంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని కేంద్ర హోమ్ శాఖ ప్రకటించింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించేలా చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలను ప్రజలు తప్పకుండా అనుసరించాలని కేంద్రం సూచించింది.
కంటైన్మెంట్ జోన్స్ కానీ ప్రాంతాల్లో దాదాపుగా అన్లాక్ 5.0 లోనే అన్ని కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. గత నెలలోనే సినిమా థియేటర్స్, మల్టీప్లెక్సులు 50 సీటింగ్ సామర్ధ్యంతో తెరవడం, క్రీడాకారులు ట్రైనింగ్ కోసం వాడే స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్స్ కు అనుమతి ఇస్తూ, పాఠశాలలు మరియు కోచింగ్ సంస్థలను తిరిగి ప్రారంభించడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకే నిర్ణయాధికారం ఇచ్చారు. ఇవే మార్గదర్శకాలు మరో నెలపాటు కొనసాగనున్నాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu