రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని సడలింపులు పాటిస్తూ, రాష్ట్రంలో లాక్డౌన్ ను అక్టోబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు మంగళవారం నాడు ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటన చేశారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వర్చువల్ సమావేశం నిర్వహించిన అనంతరం లాక్డౌన్ పొడిగింపుపై సీఎం పళనిస్వామి నిర్ణయం తీసుకున్నారు.
ఈ లాక్డౌన్ లో కొత్త మార్గదర్శకాల ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్స్ ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. పార్శిల్ సేవలకు రాత్రి 10 గంటల వరకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే 100 మందితో సినిమా షూటింగ్లు తిరిగి ప్రారంభించుకోవచ్చని తెలిపారు. చెన్నై విమానాశ్రయంలో విమాన సేవలను అక్టోబర్ 1 నుంచి 50 నుంచి 100కి పెంచనున్నారు. సబర్బన్ ఎలక్ట్రిక్ రైలు ట్రాఫిక్ పై నిషేధం కొనసాగనుంది. 10, 11 మరియు 12 తరగతుల విద్యార్థులను స్వచ్ఛంద ప్రాతిపదికన పాఠశాలలకు అనుమతించే అంశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. 10, 12 తరగతుల ప్రారంభంపై వైద్య కమిటీతో సంప్రదించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు థియేటర్లు, ఎంటర్టైన్మెంట్ పార్క్స్, స్విమ్మింగ్ పూల్స్, బీచ్లు మరియు ఇతర సామాజిక సమావేశాల నిర్వహణపై నిషేధం కొనసాగుతుందని ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu