దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 12న) కీలక పోరు జరుగనుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ టోర్నీలో తమ తొలి మ్యాచ్లో పాకిస్థాన్ మహిళలతో తలపడనుంది. గ్రూప్-బిలో ఉన్న భారత్, పాకిస్థాన్ జట్లు నేడు వరల్డ్ కప్ తొలి పోరులో తలపడనున్నాయి. పాకిస్థాన్తో మ్యాచ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేప్టౌన్లోని న్యూలాండ్స్లో జరుగనున్న ఈ మ్యాచ్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది. కాగా భారత్ మరియు పాకిస్తాన్ గత 14 సంవత్సరాలలో 13 మహిళల టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో తలపడగా.. భారత్ 10-3 విజయాలతో స్పష్టమైన ఆధిక్యాన్ని కలిగి ఉంది. ఈ మ్యాచ్ నేటి సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్స్, డిస్నీ+ హాట్స్టార్ యాప్ మరియు వెబ్సైట్ లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం పది జట్లు ప్రపంచకప్లో పాల్గొంటుండగా వాటిని ఎ, బి రెండు గ్రూపులుగా విభజించారు. ఇంగ్లండ్, ఐర్లాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్తో కూడిన గ్రూప్-బిలో భారత్ చోటు దక్కించుకుంది. మరోవైపు, గ్రూప్ ఎలో శ్రీలంక, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మరియు దక్షిణాఫ్రికా ఉన్నాయి. ప్రతి జట్టూ గ్రూప్ దశల్లో మిగిలిన వారితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. సెమీఫైనల్కు అర్హత సాధించాలంటే, తమ గ్రూప్లో పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలవాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుత ప్రపంచ నం.1 ఆస్ట్రేలియా అత్యధికంగా ఐదుసార్లు ట్రోఫీ గెలుచుకోగా.. ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు ఒక్కోసారి గెలిచాయి. అయితే చరిత్రలో తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్గా అవతరించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఇటీవలే దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచ కప్ను భారత అమ్మాయిల జట్టు గెలుచుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఇదిలా ఉండగా.. తొలి మ్యాచ్కు ముందు భారత జట్టుకు షాక్ తగిలింది. వైస్ కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన గాయం కారణంగా దూరమైంది. ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మంధాన ఎడమచేతి మధ్య వేలికి గాయం అయింది. ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన వామప్ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా ఆమె గాయపడింది. ఈ క్రమంలో బంగ్గాదేశ్తో బుధవారం జరిగిన రెండో వామప్ మ్యాచ్కు మంధాన దూరమైంది. దీంతో ఆమె పాకిస్థాన్తో మ్యాచ్కు దూరం కానుందని జట్టు వర్గాలు వెల్లడించాయి. అయితే, వెస్టిండీస్తో ఫిబ్రవరి 15న జరిగే మ్యాచ్కు మంధాన అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది. ఇక మంథాన వరల్డ్ కప్ టోర్నీ మొత్తానికి దూరం కానుందా? ఒకటి, రెండు మ్యాచ్లకే దూరమా అనేది ఇప్పుడే చెప్పలేమని కూడా పేర్కొన్నాయి. మరోవైపు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కూడా ఫిట్నెస్ సమస్య ఎదుర్కొంటోంది. ఈమధ్యే దక్షిణాఫ్రికాలో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో హర్మన్ప్రీత్ భుజానికి గాయం అయిన విషయం తెలిసిందే.
జట్లు అంచనా..
భారత మహిళల జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), యాస్తికా భాటియా, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, రిచా ఘోష్, రేణుకా ఠాకూర్, రాధా యాదవ్, శిఖా పాండే.
పాకిస్తాన్ మహిళల జట్టు: బిస్మాహ్ మరూఫ్ (కెప్టెన్), మునీబా అలీ, సిద్రా అమీన్, నిదా దార్, అయేషా నసీమ్, అలియా రియాజ్, ఒమైమా సోహైల్, కైనత్ ఇంతియాజ్, ఫాతిమా సనా, తుబా హసన్, నష్రా సంధు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE