మౌంట్ మాంగనుయ్ సిటీలో బే ఓవల్ వేదికగా ఫిబ్రవరి 11, మంగళవారం నాడు భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన చివరిదైన మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టు ఘనవిజయం సాధించింది. టీ20 సిరీస్ ను 5-0 తో భారత్ గెలువగా, వన్డే సిరీస్ ను 3-0 తో గెలుచుకుని న్యూజిలాండ్ జట్టు దీటుగా బదులిచ్చింది. ఈ మ్యాచ్ లో భారత్ నిర్దేశించిన 297 పరుగుల లక్ష్యాన్ని 47.1 ఓవర్లలోనే న్యూజిలాండ్ చేధించింది. న్యూజిలాండ్ ఓపెనర్లు గుప్తిల్ (66), హెన్రీ నికోలస్ (80) పరుగులతో శుభారంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ విలియంసన్ (22), రాస్ టేలర్ (12) పరుగులకే అవుట్ అవ్వగా లాథామ్ (36), డి గ్రాండ్ హోమ్ (58) పరుగులతో ఇన్నింగ్ ను చక్కదిద్ది జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. భారత్ బౌలర్లలో యజ్వేంద్ర చాహల్ మూడు వికెట్లు పడగొట్టగా, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు.
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగలిగింది. ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కేఎల్ రాహుల్ (112: 9×4,2×6) శతకంతో మరోసారి చెలరేగాడు. గత 11 వన్డే ఇన్నింగ్స్లలో 6 హాఫ్ సెంచరీలు చేసిన రాహుల్, ఈ మ్యాచ్ లో శతకంతో తన ఫామ్ ను కొనసాగించాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ (62:9×4), మనీష్ పాండే (42:2×4), పృథ్వీషా (40: 3×4, 2×6) పరుగులతో రాణించారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(1), కెప్టెన్ విరాట్ కోహ్లీ (9) మరోసారి నిరాశపరిచారు. మ్యాచ్ చివర్లో శార్దూల్ ఠాకూర్ (7), రవీంద్ర జడేజా (8*), సైని (8*) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో హమీష్ బెన్నెట్ నాలుగు వికెట్లు తీయగా, నీషమ్, జేమీసన్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 21 నుంచి తోలి టెస్టు, ఫిబ్రవరి 29 నుంచి రెండో టెస్టు జరగనున్నాయి.