ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ఫిబ్రవరి 8న ఒకే దశలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత మూడువారాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారాన్ని పోటాపోటీగా నిర్వహించారు. ఈ రోజు(ఫిబ్రవరి 6) సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ ఎన్నికల ప్రచారం గడువు ముగియనుంది. సాయంత్రం ఆరు గంటలనుంచి ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంతో పాటుగా సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలను కూడా మూసివేయనున్నారు. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ మొత్తం 668 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 1.47 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఫిబ్రవరి 11వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియను చేపడతారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), భారతీయ జనతా పార్టీ (బిజెపి), కాంగ్రెస్ పార్టీలు బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ ఆప్ మరియు బిజెపిల మధ్యనే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. బీజేపీ తరపున రాష్ట్ర నాయకులతో పాటుగా ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ సీనియర్ నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు. ఫిబ్రవరి 2015 లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాల్లో 67 స్థానాలను గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో ఆప్ మరోసారి ఒంటరిగా పోటీచేస్తూ అధికారం చేజిక్కించుకునే దిశగా ప్రచారాన్ని కొనసాగించింది. జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపి) మరియు షిరోమణి అకాలీదళ్ పార్టీలు బీజేపీకి మద్దతు ప్రకటించాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ-ఆర్జేడీ పార్టీలు కూడా పొత్తు పెట్టుకున్నాయి.
[subscribe]