దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ వివక్ష చూపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. తాజాగా ఇదే నిజం చేస్తున్నట్లుగా ఈ ప్రాంతంలోని ఐదు రాష్ట్రాలకు మరో భారీ షాకిచ్చింది మోడీ సర్కార్.
తాజాగా కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కేటాయించిందని రెండు తెలుగు రాష్ట్రాలు సంబరపడుతుండగానే.. మరో కీలక నిర్ణయం తీసుకుంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం చూస్తూ.. ఇకపై దక్షిణాది రాష్ట్రాలకు కొత్తగా మెడికల్ కాలేజీలు రాకపోగా.. ఉన్న కాలేజీల్లో కూడా సీట్లు పెంచుకునే అవకాశం ఉండదు.
కేంద్రప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. ప్రభుత్వ,ప్రైవేటు రంగంలో ఉన్న మెడికల్ కళాశాలల్లో సీట్లు పెంచుకోకుండా నిషేధం విధించడంతో పాటుగా..వాటితో పాటు కొత్తగా మెడికల్ కాలేజీలనూ ఇవ్వకుండా ఓ కీలక నిబంధన విధించింది. ప్రతీ 10 లక్షల మంది జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఇచ్చేలా విధించిన ఈ కొత్త నిబంధన వల్ల.. ఇప్పటికే అంతకు మించి సీట్లు కలిగి ఉన్న దక్షిణాది రాష్ట్రాలు మాత్రం ఎక్కువగా నష్టపోనున్నాయి.దీనికి తోడు కొత్తగా సీట్లు కోరే అవకాశం కూడా ఉండదు.
వచ్చే సంవత్సరం నుంచి మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం రిలీజ్ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కొత్త అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ కళాశాలలను స్థాపించడానికి అప్లికేషన్లను 50, 100, 150 సీట్లకు మాత్రమే అనుమతిస్తారు. ఆ రాష్ట్రంలోని లక్ష జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్ల నిష్పత్తి నిబంధనను ప్రతీ మెడికల్ కాలేజ్ పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటిస్తేనే జాతీయ వైద్య కమిషన్ ఆయా కాలేజీలను, సీట్లను గుర్తిస్తుంది.
ఈ మధ్య పార్లమెంటులో వెల్లడించిన వివరాల ప్రకారం.. 2021 నాటికి 7.64 కోట్ల జనాభాకు తమిళనాడు రాష్ట్రంలో 11,600 సీట్లు ఉన్నాయి. అలాగే కర్ణాటక రాష్ట్రంలో 6.68 కోట్ల జనాభాకు 11,695 సీట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.27 కోట్ల జనాభాకు 6,435 సీట్లు, కేరళ రాష్ట్రంలో 3.54 కోట్ల జనాభాకు 4,655 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం చూసుకున్నట్లయితే.. తమిళనాడులో దాదాపు 7,600 సీట్లు, కర్ణాటకలో 6,700 సీట్లు, ఏపీలో 5,300 సీట్లు, కేరళలో 3,500 సీట్లు, తెలంగాణలో 3,700 సీట్లను మాత్రమే కలిగి ఉండాలి. అంతేకాదు మరోవైపు అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ డాక్టర్ టూ జనాభా నిష్పత్తి 1:1,000 కంటే కూడా ఎక్కువగా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
కేంద్రం తాజా మార్గదర్శకాల ప్రకారం.. జిల్లాకో మెడికల్ కాలేజీ కావాలని ప్రధానంగా కోరుకుంటున్న దక్షిణాది రాష్ట్రాలయిన ఏపీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు శరాఘాతం కానున్నాయి. తాజా మార్గదర్శకాలపై దక్షిణాది రాష్ట్రాలు మండిపడుతున్నాయి. దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్ల నిబంధన ఎలా అమలు చేయాలనుకుంటున్నారని దక్షిణాది రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. ఉత్తరాది వెనుకబాటును దక్షిణాది రాష్ట్రాలపై రుద్దుతారా అని మండిపడుతున్నాయి. దీనిపై త్వరలోనే న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE