ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 ఏప్రిల్ 9న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సీజన్ కు కెప్టెన్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టుకు కొత్త కెప్టెన్ గా టీమిండియా వికెట్కీపర్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం నిర్ణయించింది. రిషభ్ పంత్ కు జట్టు కెప్టెన్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా మంగళవారం రాత్రి ఢిల్లీ జట్టు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్గా ఉన్న శ్రేయాస్ అయ్యర్ ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్లో గాయపడ్డాడు. భుజానికి అయిన గాయం తీవ్రత ఎక్కువుగా ఉండడంతో ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి అతను దూరమయ్యాడు. అయితే జట్టులో రవిచంద్రన్ అశ్విన్, అజింక్య రహానే వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ కొత్త కెప్టెన్గా రిషభ్ పంత్ వైపే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం మొగ్గుచూపింది.
మరోవైపు ఐపీఎల్ 14వ సీజన్ కోసం ఎనిమిది ప్రాంఛైజీలు ఇప్పటికే ఆటగాళ్లకు ప్రాక్టీస్ శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఏప్రిల్ 9 న ఐపీఎల్ ప్రారంభమవనుండగా, మే 30న ఫైనల్ జరగనుంది. ఐపీఎల్ విజేత ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఐపీఎల్ మ్యాచులు రాత్రి 7.30 గంటలకు, మరియు మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ