ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ కొనసాగుతుంది. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ఫిబ్రవరి 8న ఒకే దశలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన మొత్తం 668 మంది అభ్యర్థుల భవితవ్యం మరి కాసేపట్లో తేలనుంది. ఢిల్లీలోని 11 జిల్లాల్లో మొత్తం 21 చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా భారీ స్థాయిలో పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ లు పోటాపోటీగా ప్రచారం నిర్వహించడంతో ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్టుగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తుంది. తాజా లెక్కల ప్రకారం 54 చోట్ల స్పష్టమైన ఆధిపత్యంతో మళ్ళీ ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా ముందుకెళ్తుంది. సంచలన ఫలితాలతో ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా మూడోసారి విజయం వైపు పయనిస్తుంది. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి అరవింద్ కేజ్రీవాల్, ప్రతాప్ గంజ్ నియోజకవర్గం నుండి మనిశ్ సిసోడియా ముందంజలో కొనసాగుతున్నారు. బీజేపీ 15 స్థానాల్లో ఆధిక్యతలో ఉండగా, ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అసలు పోటీలోనే లేకుండా పోవడం విశేషం. 2015 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ మెరుగైన స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉండడంతో ఢిల్లీ రాష్ట్రవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు సంబరాలలో మునిగారు.
[subscribe]