కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని పాఠశాలలు అక్టోబర్ 5 వరకు మూసివేయాలని నిర్ణయించినట్టు ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 18, శుక్రవారం నాడు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 5 వరకు మూసివేసే ఉంటాయని చెప్పారు. అయితే ఆన్లైన్ తరగతులు మరియు లెర్నింగ్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని ఢిల్లీ విద్యాశాఖ అధికారులు జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆన్లైన్ తరగతులు నిర్వహణ, ఇతర పనులను సజావుగా సాగేందుకు అవసరమైన సిబ్బందిని పాఠశాలకు రమ్మని పిలిచేందుకు ప్రిన్సిపాల్స్ కు అధికారాలు ఇస్తున్నట్టు తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా మార్చిలో లాక్ డౌన్ విధించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలు, విద్యాసంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన అన్లాక్-4 మార్గదర్శకాలలో సెప్టెంబర్ 21 నుంచి కంటైన్మెంట్ ప్రాంతాల వెలుపల 9 నుండి 12 తరగతుల విద్యార్థులు తమ పాఠశాలకు ఉపాధ్యాయుల సూచనలతో, స్వచ్ఛంద ప్రాతిపదికన వెళ్లొచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు/సంరక్షకుల రాత పూర్వక అంగీకార పత్రం తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లోని పాఠశాలలు సెప్టెంబర్ 21 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం మాత్రం కేసులు పెరుగుతుండడంతో అక్టోబర్ 5 వరకు పాఠశాలల మూసివేతకే నిర్ణయం తీసుకుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu