ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనంలో సభ్యులైన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్ బదిలీ అయ్యారు. ఆయనను పంజాబ్-హర్యానా హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ బాబ్డే తో సంప్రదింపుల అనంతరం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్ను పంజాబ్-హర్యానా హైకోర్టుకు బదిలీచేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారని కేంద్ర న్యాయశాఖ ఫిబ్రవరి 26, బుధవారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అయితే విచారణలో భాగంగా ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఘటనల సమయంలో పోలీసులు తీరుపై జస్టిస్ ఎస్.మురళీధర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన పలువురు బీజేపీ నేతలపై కేసులు ఎందుకు పెట్టలేదని పోలీసులను ప్రశ్నించారు. ఆ తర్వాత కొన్ని గంటలకే జస్టిస్ మురళీధర్ బదిలీ అవ్వడంతో ఈ అంశం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మురళీధర్ ను బదిలీ చేసిందని ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రణ్దీప్ సుర్జేవాలాతో పాటు పలువురు కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
జస్టిస్ ఎస్.మురళీధర్ బదిలీపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు కేంద్రం ప్రభుత్వం దీటుగా బదులిచ్చింది. జస్టిస్ మురళీధర్ బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం ఫిబ్రవరి 12నే సిఫార్సు చేసిందని, అందుకు అనుగుణంగానే బదిలీ జరిగిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. బదిలీకి సంబంధించి మురళీధర్ సమ్మతి కూడా తీసుకున్నామని, ఇదంతా పద్ధతి ప్రకారం సాధారణ ప్రక్రియలో భాగంగా జరిగిందని చెప్పారు. ఒక సాధారణ బదిలీని రాజకీయం చేయడం ద్వారా, కాంగ్రెస్ పార్టీ న్యాయవ్యవస్థ పట్ల తనకున్న గౌరవాన్ని మరోసారి ప్రదర్శించిందని అన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారని, అప్పటినుంచే దేశంలోని పలు సంస్థలు, వ్యవస్థలపై దాడి చేస్తూ వాటిని నాశనం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు.
[subscribe]