తమిళనాడు ప్రభుత్వం జస్టిస్ చంద్రుకు డాక్టర్ అంబేడ్కర్ అవార్డు ప్రకటించింది. ప్రతి యేటా సామాజిక న్యాయం కోసం, అట్టడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడే ప్రముఖులను ప్రభుత్వం “పెరియార్ మరియు అంబేడ్కర్” అవార్డులతో సత్కరిస్తుంది. ఈ మేరకు 2021 సంవత్సరానికి గాను ఈ అవార్డులకు ఎంపిక చేసిన ప్రముఖుల పేర్లను ‘సీఎం స్టాలిన్’ శుక్రవారం ప్రకటించారు. సామాజిక న్యాయ విభాగంలో ద్రావిడ ఉద్యమ పరిశోధకులు, ప్రముఖ రచయిత కె.తిరునావుక్కరసుకు ‘తందై పెరియార్ అవార్డు’ను ప్రదానం చేయనున్నారు.
అలాగే, ఆదిద్రావిడ, గిరిజనుల కోసం న్యాయ పోరాటం చేసి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రశంసలందుకున్న మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె. చంద్రుకు ‘డాక్టర్ అంబేడ్కర్ తమిళనాడు ప్రభుత్వ అవార్డు’ను ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవార్డుల కింద ఇచ్చే నగదు పురస్కారం ఇంతకుముందు లక్ష రూపాయలుగా ఉంది. అయితే, ఇప్పుడు దీనిని ఐదు లక్షల రూపాయలకు పెంచినట్లు స్టాలిన్ వెల్లడించారు. వీరిద్దరికీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో నగదు పురస్కారాలతో పాటుగా స్వర్ణ పతకాలను కూడా బహూకరించనున్నట్లు స్టాలిన్ ఆ ప్రకటనలో వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ