కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు (మార్చి 28, బుధవారం) విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. కర్ణాటకలోని మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకుగానూ (ఎస్సీ రిజర్వేడ్ 36, ఎస్టీ రిజర్వేడ్ 15) ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెప్పారు. మే 10వ తేదీన 224 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. అలాగే మే 13న ఓట్ల లెక్కింపు పక్రియ నిర్వహించి, ఫలితాలను వెల్లడించనున్నట్టు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నేటి నుంచే కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన కోవిడ్-19 గైడ్ లైన్స్ కూడా విడుదల చేశారు. కర్ణాటకలో సాధారణ ఓటర్లు సంఖ్య 5,23,63,948, సర్వీస్ ఓటర్ల సంఖ్య 47,609 కలిపి మొత్తం 5,24,11,557 ఓటర్లు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 58,282 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కాగా ప్రస్తుత కర్ణాటక అసెంబ్లీ గడువు 2023, మే 24వ తేదీతో ముగియనుంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (224 అసెంబ్లీ స్థానాలు):
- గెజిట్ నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 13
- నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు: ఏప్రిల్ 20
- నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 21
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: ఏప్రిల్ 24
- అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ: మే 10
- ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల తేదీ: మే 13.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE