యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అప్రమత్తమై కీలక చర్యలు తీసుకుంటుంది. ముందుగా డిసెంబర్ 22వ తేదీ రాత్రి 11.59 గంటల నుంచి డిసెంబర్ 31 రాత్రి 11.59 గంటల వరకు యూకే నుంచి విమానాల రాకపోకలను కేంద్రం నిషేదించింది. మరోవైపు డిసెంబరు 22 అర్ధరాత్రిలోపు యూకే నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో కొత్తరకం కరోనా వైరస్ దృష్ట్యా మంగళవారం నాడు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. గత నాలుగు వారాలుగా అనగా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకు యూకే నుంచి లేదా యూకే మీదుగా వచ్చిన ప్రయాణికులను ఈ మార్గదర్శకాల పరిధిలోకి చేర్చినట్టు కేంద్రం తెలిపింది.
కొత్త రకం కరోనా వైరస్ పై కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలివే:
- యూకే నుంచి వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికులందరూ వారి గత 14 రోజుల ప్రయాణ వివరాలను వెల్లడించాలి. అలాగే కరోనా స్క్రీనింగ్ కోసం స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని నింపాలి.
- డిసెంబర్ 23 నుండి భారత్ మరియు యూకే మధ్య విమానాలు తాత్కాలికంగా నిలిపివేయబడినప్పటికీ, డిసెంబర్ 21 నుండి 23 వరకు మధ్య కాలంలో యూకే నుండి వచ్చే ప్రయాణీకులందరూ కరోనా పరీక్షకు లోబడి ఉండాలి.
- ప్రయాణికులకు కరోనా వైరస్ పాజిటివ్గా తేలితే ఆయా రాష్ట్ర ఆరోగ్య అధికారుల సమన్వయంతో ఒక ప్రత్యేక విభాగంలో ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్ సదుపాయంలో ఉంచబడతారు. ఐసొలేషన్ మరియు చికిత్స కోసం వారికీ నిర్దిష్ట సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు.
- కొత్తరకం కరోనాపై నిర్ధారణ కోసం నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) లేదా జన్యుసంబంధ సీక్వెన్సింగ్ కోసం ఏదైనా ఇతర ప్రయోగశాలకు పంపుతారు.
- కొత్త రకం కరోనా వైరస్ నిర్ధారణ అయితే బాధితులను ప్రత్యేక ఐసోలేషన్ యూనిట్లోనే ఉంచి, ఇప్పటికే ఉన్న ప్రోటోకాల్ ప్రకారం అవసరమైన చికిత్స అందిస్తారు. ప్రారంభ పరీక్షలో పాజిటివ్ పరీక్షించిన తేదీ నుండి మళ్ళీ 14 వ రోజున బాధితుడికి కరోనా పరిక్ష నిర్వహిస్తారు. ఒకవేళ 14 వ రోజున శాంపిల్ కూడా పాజిటివ్ గా తేలితే, ఫలితం నెగటివ్ గా వచ్చేంత వరకు 24 గంటల వ్యవధిలో అతని నుంచి వరుసగా రెండు నమూనాలను తీసుకుని పరీక్షించవచ్చు.
- గత 4 వారాలుగా అనగా నవంబర్ 25, 2020 నుండి 2020 డిసెంబర్ 23 వరకు భారతదేశంలోని వివిధ అంతర్జాతీయ విమానాశ్రయాలలో యూకే ల్యాండింగ్ విమానాల యొక్క రాష్ట్రాల వారీగా ప్రయాణీకుల మానిఫెస్ట్ ను బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయబడుతుంది. ఈ డేటా నిఘా బృందాలకు అందించబడుతుంది.
- బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అందించిన మానిఫెస్ట్ యొక్క డేటా ‘ఎయిర్ సువిధా’ పోర్టల్లో లభించే ఆన్లైన్ స్వీయ-దృవీకరణ ఫారమ్ల ద్వారా భర్తీ చేయబడుతుంది.
- డిసెంబర్ 21-23 మధ్య వివిధ విమానాశ్రయాలకు చేరుకుని, పాజిటివ్ పరీక్షించిన ప్రయాణికుల యొక్క అన్ని కాంటాక్ట్ పర్సన్స్ (ఎలాంటి మినహాయింపు లేకుండా) ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాల్లో ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ కు లోబడి ఉండాలి మరియు ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పరీక్షించబడతారు. ఒకే వరుసలో కూర్చున్న సహ ప్రయాణీకులు, ముందు 3 వరుసలు మరియు వెనుక 3 వరుసలు, గుర్తించిన క్యాబిన్ క్రూను కాంటాక్ట్ పర్సన్స్ గా పరిగణిస్తారు.
- నవంబర్ 25 నుండి డిసెంబర్ 8, 2020 వరకు యూకే నుండి వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికులను జిల్లా నిఘా అధికారులను సంప్రదించి వారి ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. వారిలో ఎవరైనా లక్షణాలను కలిగిఉంటే వారికీ ఆర్టీ-పీసీఆర్ కరోనా పరీక్ష నిర్వహిస్తారు.
- జిల్లా నిఘా అధికారులు ప్రయాణికులు వచ్చిన తేదీ నుండి 28 రోజుల పాటు పరిశీలనలో ఉన్న ప్రయాణీకులను ప్రతిరోజూ పర్యవేక్షించాలి. పాజిటివ్ గా తేలిన ప్రయాణికుల అన్ని కమ్యూనిటీ కాంటాక్ట్స్ (ఎలాంటి మినహాయింపు లేకుండా) ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాల్లో ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ కు లోబడి ఉండాలి మరియు ప్రస్తుత ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం వారికి 5-10 వ రోజు మధ్య వారికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ