దేశ ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10, 2022తో ముగియనుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 68 ప్రకారం ప్రస్తుత ఉప రాష్ట్రపతి పదవీకాలం ముగియడం వల్ల ఏర్పడే ఖాళీని భర్తీ చేయడానికి, పదవీకాలం ముగిసేలోపుగానే ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘం నేడు సమావేశమై 16వ ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం షెడ్యూల్ను ఖరారు చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఆగస్టు 6న ఓటింగ్ జరుగుతుందని, అదే రోజున ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.
16 ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎలెక్టోరల్ కాలేజీలో మొత్తం 788 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఒకే బదిలీ ఓటు ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థకు అనుగుణంగా పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ సభ్యులచే ఉప రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు, రాజ్యసభలో 12 మంది నామినేటెడ్ సభ్యులు మరియు 543 మంది లోక్సభ సభ్యులతో ఎలెక్టోరల్ కాలేజీలో మొత్తం 788 మంది ఉన్నారు. ఎలెక్టర్లందరూ పార్లమెంటు ఉభయ సభలలో సభ్యులు కాబట్టి, ప్రతి పార్లమెంటు సభ్యుని ఓటు విలువ ఒకే విధంగా 1 గా ఉంటుందని చెప్పారు. ఈ ఎన్నికలలో ఓటింగ్ రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతుంది.
ఉప రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ వివరాలు:
- ఉప రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్: జూలై 5, 2022
- నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు: జూలై 19
- ఉప రాష్ట్రపతి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన: జూలై 20
- నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: జూలై 22
- రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ నిర్వహణ: ఆగస్టు 6
- పోలింగ్ సమయం : ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
- ఓట్ల లెక్కింపు పక్రియ: ఆగస్టు 6
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY