అన్నాడీఎంకే మాజీ నాయకురాలు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు వీకే శశికళ బుధవారం నాడు సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాలు, ప్రజా జీవితం నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. పదవి, పేరు, పవర్ కోసం తాను ఎప్పుడూ ఆరాటపడలేదని అన్నారు. ఇంతకాలం ప్రేమతో, ఆప్యాయతతో ఆదరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అన్నాడీఎంకే అభిమానులు, మద్దతుదారులంతా డీఎంకేను ఓడించేందుకు కలిసి పనిచేయాలని, జయలలిత వారసత్వం, బంగారు పాలన ఇలాగే కొనసాగాలని వీకే శశికళ పేర్కొన్నారు.
త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శశికళ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో నాలుగేళ్ల పాటుగా జైలు శిక్ష అనుభవించిన ఆమె ఇటీవలే విడుదలై తమిళనాడుకు చేరుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి ఆమెను బహిష్కరించినప్పటికీ, ఆ పార్టీపై ఆమెకు పట్టుఉండడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయని రాజకీయ విశ్లేషకులు భావించారు. తన మేనల్లుడు టీటీవీ దినకరన్ స్థాపించిన కొత్త పార్టీ అమ్మ మక్కల్ మున్నేత్ర కజగమ్ (ఏఎంఎంకే) ద్వారా రాజకీయాలు నడపనున్నట్టు, అలాగే ఆమె మళ్ళీ అన్నాడీఎంకేతో కూడా కలిసి పనిచేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే పార్టీలోకి శశికళ రాకను తమిళనాడు సీఎం పళనిస్వామి పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా శశికళ రాజకీయాలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఆమె ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. శశికళ ప్రకటనతో తమిళనాడు రాజకీయాలపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ