భారత మాజీ క్రికెటర్ మరియు 1983 ప్రపంచకప్ విజేత జట్టు సభ్యుడు రోజర్ బిన్నీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) 36వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ముంబైలో జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో బిన్నీ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. కాగా 67 ఏళ్ల బిన్నీ ఒక్కరే బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమే అయింది. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీ నుంచి బిన్నీ బాధ్యతలు స్వీకరించాడు. ఇక బీసీసీఐ సెక్రటరీగా జై షానే కొనసాగనున్నారు. అలాగే ఆఫీసు బేరర్ల ఎన్నిక కూడా లాంఛనమే కానుంది. 1983లో భారతదేశం చారిత్రాత్మక ప్రపంచ కప్ గెలుచుకోవడంలో రోజర్ బిన్నీ కీలక పాత్ర పోషించాడు. ఆ మెగా టోర్నీలో బిన్నీ మొత్తం 8 మ్యాచ్లు ఆడి 18 వికెట్లు పడగొట్టాడు.
ఇక ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న బిన్నీ, ఇప్పుడు తన పదవిని వదులుకోనున్నారు. కాగా గతంలో సందీప్ పాటిల్ చైర్మన్గా ఉన్నప్పుడు బిన్నీ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. ఆయన కుమారుడు స్టువర్ట్ బిన్నీ కూడా భారత జట్టు తరపున ఆడిన సమయంలో అతని పేరు చర్చకు వచ్చిన ప్రతిసారి రోజర్ బిన్నీ బోర్డు చర్చల్లో పాల్గొనేవాడు కాదు. ఇదిలా ఉండగా.. సౌరవ్కు ఐపీఎల్ ఛైర్మన్ పదవిని ఆఫర్ చేయగా, అతను ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించాడు. బీసీసీఐకి నేతృత్వం వహించిన తర్వాత అందులోని సబ్కమిటీకి అధిపతిగా ఉండటానికి అతను ఇష్టపడలేదని బోర్డు వర్గాలు తెలిపాయి. అయితే గంగూలీ ఐసీసీ చైర్మన్ పదవికి పోటీ పడాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY