టీమిండియా మాజీ క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ గత ఏడాది డిసెంబర్ లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా హర్భజన్ సింగ్ త్వరలోనే రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 92 సీట్లతో ఘనవిజయం సాధించింది. ఈ నెలాఖరులో జరిగే పంజాబ్ రాజ్యసభ ఎన్నికల్లో ఆప్ కు ఐదు స్థానాలు దక్కనున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ నుంచి హర్భజన్ సింగ్ ను రాజ్యసభకు పంపాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం జలంధర్లో ఏర్పాటు చేసే స్పోర్ట్స్ యూనివర్సిటీ బాధ్యతలను కూడా హర్భజన్ సింగ్ కు అప్పగించనున్నట్టు సమాచారం.
మరోవైపు పంజాబ్ ఎన్నికలకు ముందు హర్భజన్ సింగ్ బీజేపీలో చేరవచ్చని ఊహాగానాలు వచ్చాయి. ఆ వార్తలు భజ్జి ఖండించారు. అనంతరం నవజోత్ సింగ్ సిద్దూతో ఫోటో సోషల్ మీడియాలో ప్రచారం కాగా, కాంగ్రెస్ తరపున పోటీ చేయొచ్చని వార్తలు వచ్చాయి, కాగా అలాంటివేవీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఇటీవల పంజాబ్ లో ఆప్ ఘనవిజయం సాధించాక ట్విట్టర్ వేదికగా భజ్జి శుభాకాంక్షలు తెలిపాడు. “ఆమ్ ఆద్మీ పార్టీకి మరియు మా కొత్త ముఖ్యమంత్రి అయినందుకు నా స్నేహితుడు భగవంత్ మాన్ కు అభినందనలు. భగత్ సింగ్ గ్రామమైన ఖట్కర్ కలన్లో ఆయన కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వినడం చాలా ఆనందంగా ఉంది” భజ్జి ట్వీట్ చేశాడు. ఈ క్రమంలోనే చర్చల అనంతరం హర్భజన్ సింగ్ ను రాజ్యసభకు పంపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ