ఏపీ అసెంబ్లీలో పేదల పక్కా ఇళ్ల నిర్మాణంపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా సభలో కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేదలకు త్వరలోనే 30.76 లక్షల ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 17 వేల కాలనీలను ప్రభుత్వం నిర్మిస్తుందని, 17 లక్షల 60 వేల పక్కా ఇళ్ల నిర్మాణాలు చేపడుతామని పేర్కొన్నారు. దీనిలో భాగంగా.. తొలి విడతలో 15.60 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ప్రతి ఎమ్మెల్యే గర్వపడేలా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. సాధారణ ప్రజలకు సొంతిల్లు కట్టుకోవాలనేది ఒక కల అని, ఆ కలను నిజం చేసేందుకు తమ ప్రభుత్వం పూనుకుందని సీఎం పేర్కొన్నారు.
పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు గొప్ప ప్రయత్నం చేశారని, ఇళ్ల పట్టాల కోసం 71,811 ఎకరాల అనువైన భూమిని సేకరించారని సీఎం జగన్ తెలిపారు. ఈ క్రమంలో రూ.25వేల కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం సేకరించిందని వెల్లడించారు. నేటి వైసీపీ ప్రభుత్వం ఇళ్లు కాదు, ఏకంగా ఊళ్ళే కడుతున్నామని, దీనిలో భాగంగా రాష్ట్రంలో 17 వేల కాలనీలు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. ప్రతి కాలనీలో పూర్తి సదుపాయాలు కల్పిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. పేదల ఇళ్లకు చాలా తక్కువ ధరకే స్టీల్, సిమెంట్ అందజేస్తున్నామని చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి ప్రధాన ముడిసరుకైన ఇసుకను 20 టన్నుల దాకా ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికే లక్షకుపైగా టిడ్కో ఇళ్లు పూర్తి చేశామని, మరో 63వేల ఇళ్లు చివరి దశలో ఉన్నాయని, వచ్చే డిసెంబర్ నాటికి ఆ ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నిరుపేదలను ఇంటి యజమానులు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ